Begin typing your search above and press return to search.

రాజ్యసభ సీటు దక్కింది.. కానీ నేత ఎక్కడ?.. సింఘ్వీ సైలెంట్ వెనక అసలు వ్యూహం ఏంటి?

అయితే, ఈ విజయం తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు గాంధీ భవన్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

By:  Tupaki Political Desk   |   11 March 2026 4:00 PM IST
రాజ్యసభ సీటు దక్కింది.. కానీ నేత ఎక్కడ?.. సింఘ్వీ సైలెంట్ వెనక అసలు వ్యూహం ఏంటి?
X

తెలంగాణ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల ఘట్టం ఒక వింతైన మలుపుతో ముగిసింది. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దిగిన సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ, సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాస్తవానికి 16న ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ, ప్రత్యర్థి పార్టీల నుంచి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో వీరి ఎన్నిక లాంఛనమైంది. అయితే, ఈ విజయం తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు గాంధీ భవన్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ధ్రువీకరణ పత్రాల అందజేత

రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు అందుకోవడానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి అభ్యర్థులు అసెంబ్లీకి చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో రిటర్నింగ్ అధికారి వారిని విజేతలుగా ప్రకటిస్తూ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. వేం నరేందర్ రెడ్డి ఎంతో ఉత్సాహంగా ఆ పత్రాన్ని అందుకున్నారు. కానీ, అభిషేక్ మను సింఘ్వీ మాత్రం సర్టిఫికేట్ చేతికి రాగానే అభినందనలు స్వీకరించడం కంటే, అక్కడి నుంచి వెనుదిరగడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

మంత్రి మాట పక్కనపెట్టి..

సాధారణంగా ఇలాంటి కీలక ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజలకు, తమను ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు, పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలపడం ఒక ఆనవాయితీ. మంత్రి శ్రీధర్ బాబు కూడా అభిషేక్ మను సింఘ్వీకి అదే సూచించారు. కనీసం రెండు ముక్కలు మీడియాతో మాట్లాడి వెళ్లాలని కోరారు. కానీ, సింఘ్వీ మాత్రం ఆ సూచనను పట్టించుకోలేదు. ‘నాకు పని ఉంది, సమయం లేదు’ అన్నట్లుగా ధ్రువీకరణ పత్రం జేబులో వేసుకొని శంషాబాద్ విమానాశ్రయం వైపు పరుగులు తీశారు.

వేం విధేయత - సింఘ్వీ వైఖరి

ఒకవైపు వేం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ వేదికగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పోరాడుతానని మీడియా ముందు చెప్పారు. ఒక స్థానిక నాయకుడిగా ఆయనలో ఉన్న బాధ్యత స్పష్టంగా కనిపించింది. కానీ, సింఘ్వీ ప్రవర్తన మాత్రం ‘తెలంగాణ కేవలం నా పదవి కోసం ఒక వేదిక మాత్రమేనా?’ అన్న అనుమానాన్ని కాంగ్రెస్ కార్యకర్తల్లో కలిగించింది.

రాజకీయ వర్గాల్లో చర్చ, స్థానికేతర ముద్ర?

అభిషేక్ మను సింఘ్వీ తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వడం ఇది రెండోసారి. ఒక జాతీయ స్థాయి నాయకుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన ఆయన సేవలు రాష్ట్రానికి అవసరమని పార్టీ భావించింది. కానీ, ఆయన స్థానిక నాయకులను లేదా మీడియాను పట్టించుకోకుండా వెళ్లడం వల్ల ‘స్థానికేతరులకు టికెట్ ఇస్తే ఇలాగే ఉంటుంది’ అనే విమర్శలకు బలం చేకూర్చినట్లయింది. గెలిచిన వెంటనే కనీసం 10 నిమిషాలు కేటాయించలేనంత బిజీగా ఆయన ఉన్నారా? లేక రాష్ట్ర నాయకత్వంతో ఆయనకు ఏదైనా అసంతృప్తి ఉందా? అన్న కోణంలో చర్చలు మొదలయ్యాయి.

పదవి అనేది బాధ్యతతో కూడుకున్నది. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించే నాయకులకు ప్రజా సంబంధాలు ముఖ్యం. అభిషేక్ మను సింఘ్వీ విజ్ఞతతో, చట్టపరమైన తెలివితేటలతో ఢిల్లీలో తెలంగాణ గొంతుకను వినిపిస్తారని అందరూ ఆశిస్తున్నారు. అయితే, తొలి రోజే ఆయన ప్రదర్శించిన ఈ ‘స్పీడ్’ అండ్ ‘సైలెంట్’ పార్టీ వర్గాల్లో మిశ్రమ స్పందనను కలిగిస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం చేసినా అది ప్రజల దృష్టిలో ఉంటుంది. పదవి ఇచ్చిన రాష్ట్రాన్ని, ప్రజలను గౌరవించడం నాయకులకు కనీస ధర్మం. సింఘ్వీ ఈ 'సైలెంట్ ఎగ్జిట్' వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఆయనే చెప్పాలి!