పో*ర్న్ చూపించి వీర్యం సేకరణ!... తెరపైకి షాకింగ్ విషయాలు!
అవును... ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి కీలక విషయాలు తెలుసుకున్నారు. ఇదే సమయంలో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
By: Raja Ch | 29 July 2025 12:54 PM ISTసికింద్రాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఆస్పత్రి వ్యవహారంలో తవ్వేకొద్దీ షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ వీర్యం సేకరణకు చేస్తున్న పనులు షాకింగ్ గా మారాయని అంటున్నారు.
అవును... ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి కీలక విషయాలు తెలుసుకున్నారు. ఇదే సమయంలో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో... వీర్యం సేకరణకు ఈ క్లీనిక్ నిర్వాహకులు చేస్తోన్న పనులు తెలిసి అవాక్కయ్యారని అంటున్నారు. ఈ సమయంలో పో*ర్న్ వీడియోలను ఉపయోగించినట్లు చెబుతున్నారు.
ఇందులో భాగంగా... రోజువారీ కూలీలు, యువకులు, యాచకులకు కమీషన్ ఆశ చూపి.. వారి నుంచి గుట్టుగా వీర్యకణాలను ఈ కేంద్రం సేకరిస్తుందని పోలీసులు తెలుసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో కొంత మందికి బిర్యానీ, మద్యం ఇవ్వగా.. కాస్త చదువుకున్నవారికి రూ.4 వేలు ఇచ్చి, పో*ర్న్ వీడియోలు చూపించి వీర్యం సేకరించినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో... అండం ఇచ్చిన మహిళకు రూ.20 వేల-రూ.25 వేలు ఇచ్చారని అంటున్నారు. ఇలా అక్రమంగా సేకరించిన వీర్య, అండాలను వివిధ నగరాలకు చెందిన ఫెర్టిలిటీ కేంద్రాలకు వారు చేరవేస్తున్నట్లు తేలిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో... సికింద్రాబాద్ లో ఉన్న ఇండియన్ స్పెర్మ్ టెక్ కు వీర్యం, అండాల సేకరణకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు తెలిపారు!
వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం!:
తాజాగా సికింద్రాబాద్ లోని 'సృష్టి' సరోగసీ కేంద్రం మోసానికి పాల్పడటం, ఇదే ప్రాంతంలో అక్రమంగా వీర్యకణాలు, అండాల సేకరణ చేస్తుండటం, ఇది దేశవ్యాప్త నెట్ వర్క్ అనే చర్చ తెరపైకి రావడం అంటూ 'ఇండియన్ స్పెర్మ్ టెక్' క్లినిక్ గుట్టు రట్టవ్వడంతో.. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ సందర్భంగా... రాష్ట్రంలో అక్రమంగా నడిపిస్తున్న సరోగసీ, ఐవీఎఫ్ కేంద్రాల లెక్క తేల్చేందుకు సిద్ధమైంది!
వాస్తవానికి... తెలంగాణ రాష్ట్రంలో సుమారు 381 రిజిస్టర్డ్ సరోగసీ, ఐవీఎఫ్ కేంద్రాలు ఉండగా... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 158 వరకు ఉన్నాయి. అయితే.. ఈ మాటున అనధికారికంగా మరెన్నో కేంద్రాలు గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాలు నడిపిస్తున్నాయని.. ఈ క్రమంలో ఒక్కో జంట నుంచి రూ.5 లక్షల - రూ.30 లక్షల వరకు వసూలు చేస్తున్నాయని అధికారులు భావిస్తున్నారని తెలుస్తోంది.
ఈ సందర్భంగా వాటి పనిపట్టడంతో పాటు.. రిజిస్టర్డ్ కేంద్రాల్లోనూ చట్ట ప్రకారం ప్రక్రియను అనుసరిస్తున్నారా లేదా అనే విషయాలను అధికారులు పరిశీలించనున్నారు. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. త్వరలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
