ఈ సారి కష్టమే మంత్రి మేడమ్... !
గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కొందరు నాయకులు.. వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించాలని కొందరు పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.
By: Garuda Media | 23 May 2026 5:00 PM ISTగత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కొందరు నాయకులు.. వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించాలని కొందరు పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. అయితే.. వీరి పరిస్థితి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంది. కొందరికి విజయం నల్లేరుపై నడక అన్నట్టుగా ఉంటే.. మరికొందరి పరిస్థితి ఇబ్బందిగా మారింది. అయితే.. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలాంటి వారిలో సాలూరు ఎమ్మెల్యే కమ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఒకరు. విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న ఆమె.. ఎస్టీ సమీకరణల్లో భాగంగా మంత్రి అయ్యారు. అయితే.. ప్రస్తుతం ఆమె గ్రాఫ్ అంతగా పుంజుకోవడం లేదని స్థానికంగా పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. దీంతో గత రెండు మాసాలుగా స్థానికంగా తిష్ఠ వేశారు. నియోజకవర్గంలో కలియ దిరుగుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితిలో మంత్రులకు నిజంగానే తమ తమ నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం ఇబ్బంది గానే ఉందన్నది వాస్తవం. ఒకవైపు మంత్రిగా బాధ్యతలు.. మరోవైపు ఇంచార్జ్గా ఉన్న జిల్లాల బాధ్యతలు వారికి ఊపిరి సలపడం లేదు. దీనికి తోడు.. సాలూరులో కుటుంబ రాజకీయాలు పెరిగిపోవడం.. మంత్రికి సెగ పెంచుతున్నాయి. ఇటీవల గ్రాఫ్లోనూ ఆమె వెనుకబడ్డారన్నది వాస్తవం. అంతేకాదు.. తన కుటుంబ సభ్యులపై విమర్శలు వచ్చాయి.
ఈ పరిణామాల నుంచి బయట పడేందుకు మంత్రిగా సంధ్యారాణి ఎదురు దాడి వ్యూహాన్ని ఎంచుకున్నా రు. ఇదికూడా వర్కవుట్ కాలేదు. దీంతో ఇప్పుడు.. తానే స్వయంగా రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో పాదయాత్ర సహా.. ప్రతి ఇంటి తలుపూ తడుతున్నారు. తన వర్గాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. ఓటు బ్యాంకును కూడా పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా.. కూడా.. కుటుంబ రాజకీయ వ్యతిరేకత అయితే.. భారీగానే తగులుండడంతో ఈ సారికి కష్టం మేడమ్ అంటూ.. కొందరు వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.
