Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడితో రష్యా అణు కేంద్రం కలకలం

ఒకవైపు ఇరుదేశాలు శాంతి చర్చలకు సిద్ధమని చెబుతూనే, మరోవైపు సైనిక దాడులు ఆపకపోవడం అంతర్జాతీయ వర్గాలను అయోమయానికి గురి చేస్తోంది.

By:  A.N.Kumar   |   24 Aug 2025 11:09 PM IST
ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడితో రష్యా అణు కేంద్రం కలకలం
X

రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం మరింత తీవ్రతరమవుతోంది. ఒకవైపు శాంతి చర్చలకు సిద్ధమని ఇరుపక్షాలు మాటల్లో చెబుతున్నప్పటికీ, మరోవైపు యుద్ధరంగంలో దాడులు, ప్రతిదాడులు ఆగడం లేదు. తాజాగా ఈ సంఘర్షణలో మరో కొత్త మలుపు తిరిగింది. ఉక్రెయిన్‌ తమ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రష్యాలోని భారీ అణు విద్యుత్‌ కేంద్రంపై డ్రోన్‌ దాడి జరిపింది. ఈ ఘటనతో రష్యా అంతటా ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది.

- భారీ న్యూక్లియర్ ప్లాంట్ పై దాడి

రష్యాలోని ప్రముఖ అణు విద్యుత్‌ ప్లాంట్ సమీపంలోని ఫ్యూయెల్‌ టెర్మినల్‌పై డ్రోన్‌ బాంబులు పడ్డాయి. మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అణు కేంద్రం అంటేనే ప్రమాదకరమని భావించే ప్రజలు రేడియేషన్‌ లీకేజీ జరిగిందేమోనన్న భయంతో ఉలిక్కిపడ్డారు. అయితే, రష్యా రక్షణ శాఖ తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చిందని తెలిపింది.

- 95 డ్రోన్లను కూల్చేసిన రష్యా

రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకారం.. ఉక్రెయిన్‌ ఒకేసారి పెద్ద ఎత్తున డ్రోన్‌ దాడి జరిపింది. మొత్తం 95 ఉక్రెయిన్‌ డ్రోన్లను రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి. కొన్నింటి ముక్కలు ప్లాంట్‌ సమీప ప్రాంతంలో పడ్డాయి. దాడి విస్తారంగా జరిగినప్పటికీ, రేడియేషన్‌ స్థాయిలు సర్వసాధారణంగానే ఉన్నాయని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు.

- ఉక్రెయిన్‌ వ్యూహం వెనుక ఉద్దేశ్యం?

ఉక్రెయిన్‌ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రష్యాకు గట్టి హెచ్చరిక ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ దాడి జరిపినట్లు భావిస్తున్నారు. అణు కేంద్రాలపై దాడి చేయడం ద్వారా రష్యాకు ఆర్థిక, సాంకేతికంగా నష్టం కలిగించడమే కాకుండా, అంతర్జాతీయ వేదికలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం ఉక్రెయిన్‌ చేస్తున్నట్లు నిపుణుల అభిప్రాయం.

- అంతర్జాతీయ ఆందోళన

అణు విద్యుత్‌ కేంద్రాలపై దాడి జరగడం ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతోంది. ఒకవేళ ప్రమాదవశాత్తు రేడియేషన్‌ లీక్‌ అయితే, అది కేవలం రష్యా, ఉక్రెయిన్‌లకే కాకుండా, యూరప్‌ మొత్తానికీ ప్రమాదం కలిగించగలదు. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) ఇప్పటికే ఇరుపక్షాలనూ అణు కేంద్రాలపై దాడులు చేయవద్దని పలుమార్లు హెచ్చరించింది.

- శాంతి మాటల్లోనే

ఒకవైపు ఇరుదేశాలు శాంతి చర్చలకు సిద్ధమని చెబుతూనే, మరోవైపు సైనిక దాడులు ఆపకపోవడం అంతర్జాతీయ వర్గాలను అయోమయానికి గురి చేస్తోంది. ఈ దాడి తర్వాత రష్యా మరింత కఠిన వైఖరిని అవలంబించే అవకాశముంది.

ఉక్రెయిన్‌ స్వాతంత్ర్య దినోత్సవం నాడు రష్యా అణు విద్యుత్‌ ప్లాంట్‌పై జరిగిన ఈ డ్రోన్‌ దాడి మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇప్పటివరకు జరిగిన దాడులు భూభాగం, సైనిక కేంద్రాలకు మాత్రమే పరిమితమైతే, అణు కేంద్రాలపై దాడి జరగడం యుద్ధానికి కొత్త ముప్పు సంకేతం ఇస్తోంది. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం మరింత విస్తరించి, ప్రమాదకర దశకు దారితీసే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.