ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా తల్లిదండ్రులను వదిలేస్తున్నారా?!
ఇదో పెద్ద బిగ్ క్వశ్చన్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ కూడా సాగుతోంది. అంతేకాదు.. నెటిజన్లు కూడా తెగ వెతికేస్తున్నారు.
By: Garuda Media | 30 March 2026 8:15 AM ISTఇదో పెద్ద బిగ్ క్వశ్చన్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ కూడా సాగుతోంది. అంతేకాదు.. నెటిజన్లు కూడా తెగ వెతికేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారా? లేదా? అనేదే ఇప్పుడు పెద్ద డౌట్. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని నెటిజన్లు.. ఎమ్మెల్యేలు, ఎంపీల కుటుంబాలు.. వారి తల్లిదండ్రులు ఎక్కడున్నా రు? ఏం చేస్తున్నారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇదేదో వదంతి కాదు.. పక్కా నిజం!.
రీజనేంటి?
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ప్రజాప్రతినిధులు కూడా తమ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదన్నారు. వారిని అనాథ, వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారని మాకు సమాచారం ఉందన్నారు. ఇలాంటి వారికి కూడా `ఈ చట్టం` వర్తిస్తుందని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నిజమేనా? ప్రజలను పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు ఈవిషయంలో ఎలానూ కొన్నిచోట్ల వెనుకబడుతున్నారు. ఇక, వారి సొంత తల్లిదండ్రులను కూడా పట్టించుకోవడం లేదా? అనే చర్చ ప్రారంభమైంది.
ప్రత్యేక చట్టం..
గత ఏడాదిన్నర కాలంగా సీఎం రేవంత్ రెడ్డి.. ఉద్యోగులను ఒక విషయంపై హెచ్చరిస్తున్నారు. తల్లదండ్రులను పట్టించుకోని.. ఉద్యోగులను ఉపేక్షించేది లేదన్నారు. అంతేకాదు.. వారి జీతాల్లో 10 శాతం చొప్పున కోత పెట్టి తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తామ న్నారు. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై ప్రత్యేకంగా ఒక బిల్లును పెట్టి కొత్త చట్టం తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అదే.. ‘తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత’ బిల్లు. ఆదివారం జరిగిన సభలో అధికార పార్టీ సహా.. విపక్ష సభ్యుల్లో కొందరు ఈ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు మాత్రమే కాదని.. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు కూడా తమ తల్లిదండ్రులను గాలికి వదితేస్తున్నారని అన్నారు. ఇలాంటి వారికి కూడా ఈ చట్టం వర్తిస్తుందని తెలిపారు. పిల్లలను తమ రెక్కల కష్టంతో పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యం వచ్చాక పట్టించుకోకపోవడాన్ని ఈ బిల్లు నేరంగా పరిగణిస్తుంది. ఈ క్రమంలో ఉద్యోగుల జీతంలో 10 శాతం చొప్పున కోతపెట్టి వారి ఖాతాల్లోకి జమ చేస్తుంది. అదే ప్రజాప్రతినిధులు అయితే.. వారి జీతం లేదా పింఛనులో 10 శాతం కోత పెట్టివృద్ధులైన తల్లిదండ్రులకు అందిస్తారు.
