Begin typing your search above and press return to search.

పేరులో 'రాజీవ్' ఉంద‌ని.. తొక్కేశారు: రేవంత్‌

ఆరోగ్య శ్రీకి సంబంధించి.. ఇప్పటివరకు 2,408 కోట్ల రూపాయ‌ల‌ను హాస్పిట‌ల్స్‌కు చెల్లించిన‌ట్టు సీఎం వివ‌రించారు.

By:  Garuda Media   |   26 March 2026 7:33 PM IST
పేరులో రాజీవ్ ఉంద‌ని.. తొక్కేశారు:  రేవంత్‌
X

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌ధాన ప్రతిప‌క్షం బీఆర్ ఎస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా గురువారం.. వైద్య విద్య‌, ఆరోగ్య శ్రీసేవ‌లు అనే అంశంపై స‌భ‌లో చ‌ర్చ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆరోగ్య శ్రీ అంశాన్ని ప్ర‌స్తావిస్తూ.. పేరులో రాజీవ్ ఉంద‌న్న కార‌ణంగా.. ఆరోగ్య శ్రీని గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం తొక్కిప‌డేసింద‌ని.. ఇప్పుడు దానికితాము జీవం పోస్తున్నామ‌ని తెలిపారు.

పేద‌ల‌కు ఆరోగ్యాన్ని ప్ర‌సాదించే ప‌థ‌కంపైనా బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం రాజ‌కీయం చేసింద‌ని విమ‌ర్శించా రు. తాము రాగానే గ‌త ప్ర‌భుత్వ బ‌కాయిల‌తో పాటు ప్ర‌స్తుత బిల్లుల‌ను కూడా ఆయా వైద్య‌శాల‌ల‌కు చెలి స్తున్న‌ట్టు తెలిపారు. విద్య‌, పేద‌ల వైద్యానికి గ‌త ప‌దేళ్ల‌లో ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని.. తాము వాటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఈ రెండు రంగాల‌ను అభివృద్ది చేయ‌డం ద్వారా.. రోల్ మోడ‌ల్‌గా రాష్ట్రాన్ని మారుస్తున్న‌ట్టు వివ‌రించారు.

ఆరోగ్య శ్రీకి సంబంధించి.. ఇప్పటివరకు 2,408 కోట్ల రూపాయ‌ల‌ను హాస్పిట‌ల్స్‌కు చెల్లించిన‌ట్టు సీఎం వివ‌రించారు. ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి ప‌థ‌కంపై మాట్లాడుతూ.. గ‌త ప్ర‌భుత్వంలో ఈ సాయం చేయ డానికి కూడా అవినీతికి పాల్ప‌డ్డార‌ని విమ‌ర్శించారు. కానీ.. ఇప్పుడు అత్యంత పార‌ద‌ర్శ‌కంగా అవ‌స‌రంలో ఉన్న‌వారికి ముఖ్య‌మంత్రి స‌హాయ‌న నిధి నుంచి నిధులు విడుద‌ల చేస్తున్న‌ట్టు వివ‌రించారు.

ప్ర‌తిప‌క్షం ఉందా?

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం ఉందా? అనే అనుమానాలు వస్తున్నాయ‌ని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏ ఒక్క అంశంలోనైనా ఇప్ప‌టి వ‌ర‌కు స‌ల‌హాలు సూచ‌న‌లు ఇస్తారేమోన‌ని ఎదురు చూశామ‌న్నారు. కానీ, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం.. అభివృద్ధి చేస్తుంటే.. దొడ్డిదారిలో న్యాయ‌ప‌ర‌మైన విభేదాలు సృష్టించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం లేద‌న్న భావ‌న‌తోనే తాము ప‌నిచేస్తున్నామ‌న్నారు. త‌మ‌కు తామే ప్ర‌తిప‌క్షంగా మ‌న‌స్సాక్షిని ప్ర‌శ్నించుకుని ప్ర‌జ‌ల ప‌క్షాన అభివృద్దికి ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు తెలిపారు.