రేషన్ మాఫియా: జనసేనకు పెద్ద తలనొప్పా ..!
ఈ నేపథ్యంలో ఇలాంటి రేషన్ మాఫియాని కట్టడి చేసేందుకు ప్రభుత్వం మంచీ నిర్ణయం తీసుకుంది. ఇది వరకు అక్రమంగా తరలించే రైస్ ని టెస్ట్ చేయడానికి ల్యాబ్ కి పంపి వారం రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది.
By: Garuda Media | 18 Oct 2025 1:00 PM ISTరాష్ట్రంలో కీలకంగా మారిన రేషన్ మాఫియాను అరికట్టేందుకు.. జనసేన ప్రయత్నిస్తోంది. పౌరసరఫరాల శాఖ ఈ పార్టీ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలోనే ఉన్న నేపథ్యంలో దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ పోర్టులో గత ఏడాది పర్యటించిన పవన్ కల్యాణ్.. సీజ్దిషిప్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ నాయకుల మాటల్లో వినిపిస్తున్నాయి. అదేసమయంలో రేషన్ మాఫియాలో పెద్దల హస్తం ఉండడం.. తీర ప్రాంతాల్లో రేషన్ మాఫియా రెచ్చిపోతున్న తీరు కూడా ఇబ్బందిగానే ఉంది.
ఈ నేపథ్యంలో ఇలాంటి రేషన్ మాఫియాని కట్టడి చేసేందుకు ప్రభుత్వం మంచీ నిర్ణయం తీసుకుంది. ఇది వరకు అక్రమంగా తరలించే రైస్ ని టెస్ట్ చేయడానికి ల్యాబ్ కి పంపి వారం రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మొబైల్ కిట్ లో ఉండే కెమికల్ బాటిల్స్ ఉంచుతున్నారు. కెమికల్ను రేషన్ బియ్యం లో వేసినప్పుడు పోషక విలువల కోసం రేషన్ బియ్యంలో కలుపుతున్న పోర్టిఫైడ్ రైస్ ఎరుపు రంగులోకి మారతాయి. వెంటనే అది అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం అని అర్ధం అయిపోతుంది.
ఇందుకోసం 700 కిట్లు, 33 మంది అదనపు సిబ్బందిని విశాఖపట్నం లో 3 చెక్ పోస్ట్ ల దగ్గర నియమించా రు. అలాగే కాకినాడ లో కూడా వీరిని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. దీంతో ఆంధ్రాతో పాటు తెలంగాణ నాయకులకు కూడా గండి పడినట్టేనని ఒకవైపు నాయకులు చెబుతున్నారు. దేశంలో ఉన్న అన్ని పోర్ట్ ల దగ్గర పెడితే బియ్యం మాఫియా అంతరిస్తుందని కూడా అంటున్నారు. కానీ.. ఎక్కడికక్కడ విస్తరిస్తున్న ఈ మాఫియాను కట్టడి చేయడం కేవలం టెస్టులతో అయ్యే పనేనా? అనేది మరోప్రశ్న.
వాస్తవానికి ఎలాంటి టెస్టులు చేశారన్న దానికంటే కూడా.. పట్టుకున్న బియ్యం విషయంలో కేసులు నమోదు చేస్తున్నారా? చేస్తే.. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అనేది కీలకం. గతంలో వైసీపీ నేత పేర్నినాని కుటుంబంపై కూడా కేసు నమోదైంది. ఆ తర్వాత.. అది మాఫీ జరిగిందన్న చర్చ వచ్చింది. కాకినాడలో ఒక పెద్ద నేతకు చెందిన రైస్ మిల్లులపై దాడులు జరిగాయి. ఆ తర్వాత అది కూడా తెరమరుగు అయింది. ఇలా.. చాలా కేసులు ఉన్నాయి. వాటి సంగతి ఎక్కడికక్కడే మిగిలిపోయింది. దీనికి రాజకీయం ఉన్న ఒత్తిడే కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కరం ఏమేరకు ఉంటుందనేది చూడాలి.
