రాజ్యసభలో ఒక సుదీర్ఘ నిశ్శబ్దం.. గొగోయ్ ప్రస్థానం వెనుక రహస్యం ఏంటి?
మౌనంగా ఉన్నప్పటికీ, ఆయన తన పదవీ కాలంలో ఒకే ఒక్కసారి గళం విప్పారు. 2023 ఆగస్టులో జరిగిన 'ఢిల్లీ సర్వీసెస్ బిల్లు'పై చర్చలో జస్టిస్ గొగోయ్ పాల్గొన్నారు.
By: Tupaki Political Desk | 17 March 2026 10:03 AM ISTభారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభ ఎంపీ పదవీకాలం నిన్నటితో అధికారికంగా ముగిసింది. 2020 మార్చి 16న కేంద్ర ప్రభుత్వం ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. న్యాయ వ్యవస్థలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి, శాసన వ్యవస్థలో ఎలాంటి మార్పులు తెస్తారోనని అందరూ ఆసక్తిగా గమనించారు. అయితే, ఆరేళ్ల పదవీ కాలం ముగిసే సరికి ఆయన పార్లమెంటరీ రికార్డులు చూసి రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రశ్నల్లేని ఆరేళ్లు..
రాజ్యసభలో ఒక ఎంపీకి ఉన్న ప్రాథమిక బాధ్యత ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడం. కానీ, జస్టిస్ రంజన్ గొగోయ్ తన ఆరేళ్ల పదవీ కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. పార్లమెంటు రికార్డుల ప్రకారం ఆయన అటెండెన్స్ కూడా కేవలం 53 శాతంగానే నమోదైంది. అంటే సగం రోజులు మాత్రమే ఆయన సభకు హాజరయ్యారు. ఒక మాజీ సీజేఐ స్థాయి వ్యక్తి సభలో మౌనంగా ఉండడం, కనీసం తన రంగానికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులపై కూడా స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.
ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై చర్చ!
మౌనంగా ఉన్నప్పటికీ, ఆయన తన పదవీ కాలంలో ఒకే ఒక్కసారి గళం విప్పారు. 2023 ఆగస్టులో జరిగిన 'ఢిల్లీ సర్వీసెస్ బిల్లు'పై చర్చలో జస్టిస్ గొగోయ్ పాల్గొన్నారు. అప్పటి వరకు సభకు దూరంగా ఉన్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిల్లుపై మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ ఒక్క ప్రసంగం మినహాయిస్తే, మిగిలిన ఐదేళ్లూ ఆయన సభలో ఒక నిశ్శబ్ద ప్రేక్షకునిగానే మిగిలిపోయారు.
నన్ను ఏ పార్టీ నియంత్రించలేదు: గొగోయ్
తన పార్లమెంటరీ పనితీరుపై వస్తున్న విమర్శలకు జస్టిస్ గొగోయ్ గతంలోనే సమాధానం ఇచ్చారు. 2021లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ముఖ్యమైన అంశాలు అని భావించినప్పుడు మాత్రమే మాట్లాడతాను. నన్ను ఏ పార్టీ నియంత్రించలేదు’ అని స్పష్టం చేశారు. అంటే, సభలో అందరిలాగా అనవసరంగా మాట్లాడడం కంటే, తనకు అవసరమనిపించినప్పుడే గొంతు విప్పాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఒక ఎంపీగా ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన బాధ్యతను ఆయన విస్మరించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రంజన్ గొగోయ్ రాజ్యసభ ప్రస్థానం అనేక వివాదాలు, విశ్లేషణల మధ్య ముగిసింది. న్యాయమూర్తిగా చారిత్రాత్మక తీర్పులు ఇచ్చిన ఆయన, ఎంపీగా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయారనేది రికార్డులు చెబుతున్న సత్యం. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను రాజ్యసభకు పంపడం సరైనదేనా అనే చర్చను ఆయన పదవీకాలం రాజేసింది. ఏది ఏమైనా, భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక మాజీ సీజేఐ ఆరేళ్ల పాటు ఒక్క ప్రశ్న కూడా అడగకుండా పదవీ విరమణ చేయడం అరుదైన, వింతైన రికార్డుగానే నిలిచిపోతుంది.
