టీడీపీ, జనసేన షాకింగ్ డెసిషన్ : రాజ్యసభ అభ్యర్థులుగా పరిశీలనలో కొత్త పేర్లు!
వచ్చేనెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కూటమి పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
By: Tupaki Political Desk | 13 April 2026 2:33 PM ISTవచ్చేనెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కూటమి పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, ఆ నాలుగు కూటమికే దక్కనున్నాయి. దీంతో అభ్యర్థుల ఎంపికపై తీవ్రమైన కసరత్తు జరుగుతోందని అంటున్నారు. కూటమిలోని మూడు పార్టీలు ఈ నాలుగు స్థానాలను పంచుకోవాలని భావిస్తుండగా, సంఖ్యాబలం ప్రకారం టీడీపీకి రెండు, బీజేపీ, జనసేనకు చెరో రాజ్యసభ స్థానం కేటాయించాలని చర్చలు సాగుతున్నాయని అంటున్నారు. అయితే ఇప్పటికే బీజేపీకి రెండు సార్లు అవకాశం వచ్చినందున తమకు ఈ సారి మూడు స్థానాలు ఇవ్వాలని టీడీపీ ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ చర్చలు ఇలా కొనసాగుతున్న సమయంలోనే అభ్యర్థుల ఎంపికపై కొత్త పేర్లు తెరపైకి వచ్చాయనే ప్రచారం ఊపందుకుంది.
కూటమి కోటాలో రాజ్యసభ స్థానాలను చాలా మంది నేతలు ఆశిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ, బీజేపీలో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. జనసేనలో కూడా చాలాకాలంగా ఒకరిద్దరి పేర్లపై చర్చ జరిగినా తాజాగా మరో కొత్తపేరు ప్రచారంలోకి వచ్చింది. దీంతో అభ్యర్థుల ఎంపికపై చివరి వరకు ఉత్కంఠ కొనసాగనుందని అంటున్నారు. నాలుగు స్థానాలను ఎలా సర్దుబాటు చేసుకున్నా, నేతల మధ్య పోటీ మాత్రం తీవ్రంగానే కనిపిస్తోందని చెబుతున్నారు. టీడీపీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇవ్వాలని ముందుగా అనుకున్నా, తాజాగా తెరపైకి వస్తున్న పేర్లతో త్యాగ రాజులకు చాన్స్ దక్కే పరిస్థితి అనుమానమే అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ కోటా రాజ్యసభకు పరిశీలనలో పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్, భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎళ్లా, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, మంత్రి నారా లోకేశ్ సన్నిహితుడు కిలారు రాజేశ్ పేర్లు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. సిట్టింగ్ ఎంపీ సానా సతీశ్ ఎన్నికై కేవలం ఏడాదిన్నర మాత్రమే కావడంతో ఆయనకు రెండోసారి కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇక మిగిలిన ఒకటి లేదా రెండు స్థానాలకు పోటీ రోజురోజుకు ఎక్కువవుతోందని అంటున్నారు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్, భాష్యం రామకృష్ణ పేర్లు తొలి నుంచి ప్రచారంలో ఉన్నప్పటికీ వారికి కృష్ణ ఎల్లా, కిలారు రాజేశ్ రూపంలో పోటీ ఎదురుకావడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని అంటున్నారు. కృష్ణా ఎల్లా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో నిష్ణాతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఓ మీడియా గ్రూప్ తో ఆయనకు ఉన్న బంధుత్వం వల్ల కూడా ఆయన పేరు తేలిగ్గా తీసుకోలేకపోతున్నారని అంటున్నారు. కృష్ణా ఎల్లా పేరు తెరపైకి రావడంతో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ అవకాశాలను దెబ్బ తీస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇద్దరూ ఒకేసామాజిక వర్గం కావడం, పారిశ్రామిక రంగానికి చెందిన వారు అవడంతోపాటు ఆ ఇద్దరు స్వస్థలాలు చిత్తూరు జిల్లా కావడం వల్ల ఇద్దరిలో ఒకరికే చాన్స్ దక్కే పరిస్థితి ఉందని అంటున్నారు.
టీడీపీకి రెండే సీట్లు కేటాయిస్తే ఒకటి ఎంపీ సానా సతీష్ కి రిజర్వు అయినట్లేనని మిగిలిన ఖాళీని ఎవరితో భర్తీ చేయాలనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారిందని అంటున్నారు. టీడీపీ అధిష్టానం బీజేపీపై ఒత్తిడి తీసుకువచ్చి మూడో స్థానం కూడా దక్కించుకుంటే మంత్రి లోకేశ్ ఆత్మీయుడు కిలారు రాజేశ్ కి చాన్స్ వస్తుందని అంటున్నారు. ఇక బీజేపీ మాత్రం తన కోటా కింద తమిళనాడుకు చెందిన మాజీ పోలీస్ అధికారి అన్నామలైను ఎంపిక చేయాలని చూస్తోందని చెబుతున్నారు. దీంతో మూడో స్థానంపై పీటముడి పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు జనసేన తరఫున తొలి నుంచి పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ పేరు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే అనూహ్యంగా తాజాగా సినీ నిర్మాత అల్లు అరవింద్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో జనసేనలోనూ రాజ్యసభ అభ్యర్థి ఎంపిక ఉత్కంఠకు గురిచేస్తోందని అంటున్నారు.
జనసేన కోటాలో లింగమేని రమేశ్ ను రాజ్యసభకు పంపడంపై తొలి నుంచి ఏకాభిప్రాయం ఉండేది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉండటం, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తోనూ అంతే అనుబంధం ఉన్న కారణంగా లింగమనేని రమేష్ పేరు ఫైనల్ అయినట్లేనని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా సినీ నిర్మాత అల్లు అరవింద్ పేరు వినిపిస్తుండటంతో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయని అంటున్నారు. మొత్తానికి కూటమిలో నాలుగు స్థానాలకు ముగ్గురి ఎంపికపై ఏమైనా జరగొచ్చని ఆఖరి క్షణం వరకు ఎవరికి రాజ్యసభ యోగం దక్కుతుందో అంతుచిక్కడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.
