లోక్సభ స్పీకర్పై మళ్లీ అవిశ్వాసం.. తొలిసారి రాహుల్ వద్దకు కేంద్ర మంత్రి!
ఇక, ఇప్పుడుకీలకమైన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు విషయం పెండింగులో ఉంది. దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టి.. తక్షణమే ఆమోదించుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.
By: Garuda Media | 5 Aug 2026 4:36 PM ISTపార్లమెంటు వర్షాకాల సమావేశాలు హాట్ హాట్గానే కొనసాగుతున్నాయి. గత నెల 20న ప్రారంభమైన సమావేశాలు తొలి 10 రోజుల పాటు నీట్ పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీ ఘటనపై అట్టుడికాయి. కాక్రోచ్ జనతా పార్టీ నిరసన, దీనికి మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేతలు.. ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ముందు.. మెరుపు ధర్నాకు దిగడం.. వంటి పరిణామాలతో పార్లమెంటు ఉభయ సభలు ఎలాంటి చర్చలు చేపట్టకుండానే వాయిదాల పర్వంతో ముగిసిపోయాయి. అయినప్పటికీ.. వందేమాతరం, జనన మరణ ధ్రువీకరణల బిల్లులను కేంద్రం ఆమోదించుకుంది.
ఇక, ఇప్పుడుకీలకమైన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు విషయం పెండింగులో ఉంది. దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టి.. తక్షణమే ఆమోదించుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. కానీ, ప్రతిపక్షాలు మాత్రం.. సహకరించడం లేదని కేంద్రం ఆరోపిస్తోంది. ముఖ్యంగా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, పదే పదే వాయిదా వేస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తుండగా.. మీరే సహకరించడం లేదంటూ కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం ఇలా సాగుతుండగా.. తాజాగా మరోసారి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది.
గత ఏడాది కూడా ఇలానే లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. రాహుల్గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని అప్పట్లోనూ ఆరోపించారు. దీనిపై చర్చ జరిగింది. ఓటింగులో ప్రతిపక్షం వీగి పోగా.. స్పీకర్ విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా అదే పంథాలో కాంగ్రెస్ పయనించనుంది. ఇప్పుడు రెండు రకాల వ్యూహాలతో స్పీకర్పై అవిశ్వాసం ప్రవేశ పెట్టాలని నిర్నయించుకుంది. 1) పార్లమెంటు మొహం చూడని ప్రధానిని రప్పించడం. 2) రాహుల్కు మాట్లాడేందుకు అవకాశం కల్పించడం. తద్వారా స్పీకర్ను లక్ష్యంగా చేసుకుని అవిశ్వాసం పెట్టాలని భావించింది.
ఇక, ఈ విషయం తెరమీదకు రాగానే.. ప్రభుత్వ పక్షం అలెర్ట్ అయింది. ఎన్నడూ లేని విధంగా పార్లమెం టులో ప్రతిపక్ష నేత కార్యాలయానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజుజు స్వయంగా వెళ్లారు. సభలో ప్రభుత్వానికి సహకరించాలని.. సభాకార్యక్రమాలను సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన కోరారు. అయితే.. నీట్ పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీకి వ్యతిరేకంగా ధర్నా చేసిన విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీ చార్జి, పెల్లెట్ గన్ ప్రయోగం వంటివాటికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని, ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. మరోవైపు.. పార్లమెంటు ఉభయ సభలు వరుసగా వాయిదా పడ్డాయి.
