'డ్రగ్స్' కట్టడి ప్రజల చేతుల్లోనే.. మోడీ పిలుపు
దేశాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ భూతంపై ప్రజలు స్పందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
By: Garuda Media | 30 Aug 2026 1:43 PM ISTదేశాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ భూతంపై ప్రజలు స్పందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దేశంలో మాదక ద్రవ్యాల వినియోగం ప్రమాదకరంగా మారిందన్నారు. యువత స్వల్ప సంతోషాల కోసం.. వీటి బారిన పడి.. జీవితాలను, ఉజ్వల భవిష్యత్తును కూడా నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మోడీ నిర్వహించే `మన్ కీ బాత్` ప్రసంగంలో డ్రగ్స్ విషయాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
అభివృద్ధి చెందిన భారతదేశం కోసం `మాదకద్రవ్య రహిత యువత` అనే ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చేపట్టిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. ఈ ఉద్యమం దేశంలో వేగంగా ముందుకు సాగుతోందన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తి.. కారణంగా దాని దుష్పరిణామాన్ని మొత్తం కుటుంబం , సమాజం కూడా భరించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేయాలని ప్రధాని సూచించారు.
మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం శక్తివంతమైన నినాదాలను రాయాలని, లఘు నాటికలు రచించాలని ప్రజల కు ఆయన సూచించారు. వాటిని మాదక ద్రవ్య రహిత యువత ట్యాగ్ తో సామాజిక మాధ్యమాలలో పంచుకోవాలని కోరారు. అంతేకాదు.. పొరుగు వారిని కూడా అప్రమత్తం చేయాలని కోరారు. డ్రగ్స్ భూతం దేశంలో విస్తరించకుండా కాపు కాయాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఈవిషయాన్ని సీరియస్గా తీసుకుని ముందుకు సాగాలని ప్రధాని కోరారు. ఈ విషయంలో ఏమరుపాటు తగదని అన్నారు.
కాగా.. దేశంలో మదక ద్రవ్యాల వినియోగం, రవాణా భారీ స్థాయిలో పెరిగిందని కేంద్ర హోం శాఖ ఇటీవల వెల్లడిం చింది. గంజాయి సహా.. కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు.. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి స్వేచ్ఛగా రవాణా అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం `ఈగల్` వ్యవస్థను తీసుకువచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఈగల్ టీమ్లను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ .. డ్రగ్స్ రవాణా సహా.. వినియోగం తగ్గకపోవడంపట్లకేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
