గీత దాటొద్దు.. కట్టు తప్పొద్దు: జనసైనికులకు పవన్ దిశానిర్దేశం
``గీత దాటొద్దు.. కట్టు తప్పొద్దు.`` అంటూ జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు దిశానిర్దేశం చేశారు.
By: Garuda Media | 15 Aug 2026 12:35 PM IST``గీత దాటొద్దు.. కట్టు తప్పొద్దు.`` అంటూ జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా 4 అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. వీటిని అందరూ పాటించాల్సిందేనని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అలా ఉండకపోతే.. పార్టీకి నష్టం చేకూర్చిన వారు అవుతారని ఆయన హెచ్చరించారు.
1) రాజకీయ శత్రువులు: జనసేన రాజకీయ శత్రువులు అంతర్గత విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. వారి ట్రాప్లో పడొద్దు. ముఖ్యంగా అంతర్గతంగా చర్చించుకోవాల్సిన విషయాలను బహిర్గతం చేయొద్దు. పార్టీ లైన్, నిబంధనలు నియమాలను అందరూ అర్ధం చేసుకోవాలి.
2) కూటమి స్ఫూర్తి: కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని మరింత పెంచేందుకు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు సూచించాలని పవన్ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో అస్థిరత సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకుని.. వాటి నుంచి బయట పడాలన్నారు. అంతేకాదు.. కూటమి నాయకులతోనూ కలివిడిగా ఉండాలన్నారు.
3) సోషల్ మీడియా: పార్టీ అంతర్గత వ్యవహారాలు సహా.. నాయకుల మధ్య ఉన్న అంతరాలను సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితిలో చర్చించవద్దని తెలిపారు. అలానే.. కుట్ర పూరితంగా వ్యవహరించే ప్రత్యర్థులు.. ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు సృష్టించి.. విభేదాలు తెచ్చేలా ప్రయత్నిస్తున్నారని.. వాటిని ఎవరూ ఫాలో అవ్వద్దని పవన్ తెలిపారు.
4) మహిళలకు గౌరవం: దుర్భాషలు మానాలని నాయకులకు పవన్ సూచించారు. నోరు జారొద్దని, బూతులతో విరుచుకు పడవద్దని అన్నారు. ముఖ్యంగా మహిళలను అగౌరవ పరిచే చర్యలను ఎట్టి పరిస్థితిలోనూ ఎవరూ అనుసరించరాదని పేర్కొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలుసుకుని.. వాటికి అనుగుణంగా వ్యవహరించాలని పవన్ సూచించారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకోవాలని.. విమర్శించవద్దని చెప్పారు.
