Begin typing your search above and press return to search.

ఆ పార్టీతో పోల్చొద్దు...పవన్ హాట్ కామెంట్స్ !

తమిళనాడు రాజకీయ పరిస్థితులు వేరు ఏపీ రాజకీయం వేరు అని పవన్ అన్నారు. అక్కడ జరిగిందని ఇక్కడ తనను అలాగే చేయమంటూ పోలిక తేవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.

By:  Satya P   |   16 May 2026 12:19 AM IST
ఆ పార్టీతో పోల్చొద్దు...పవన్ హాట్ కామెంట్స్ !
X

తమిళనాడులో టీవీకే పార్టీ పెట్టి రెండేళ్ళు తిరగకుండానే ముఖ్యమంత్రి అయిన దళపతి విజయ్ తో తనను పోల్చి చూడడం పట్ల జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగానే స్పందించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాలా మంది తనకు ఈ విషయంలో సలహాలు సూచనలు ఇస్తున్నారు అన్నారు. విజయ్ పార్టీ తమిళనాడులో గెలవడంతో తన విషయంలో కూడా అలాగే చేయమంటున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎవరో ఎక్కడో ఏదో చేస్తే దానికి ఏపీకి పోలిక ఏమిటి అని ప్రశ్నించారు. ఊళ్ళో పెళ్ళికి ఎవరో సందడి అన్నట్లుగా వ్యవహారం ఉందని ఆయన ఆక్షేపించారు.

రెండు చోట్లా ఓడించారు :

తమిళనాడు రాజకీయ పరిస్థితులు వేరు ఏపీ రాజకీయం వేరు అని పవన్ అన్నారు. అక్కడ జరిగిందని ఇక్కడ తనను అలాగే చేయమంటూ పోలిక తేవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాను 2019లో ఒంటరిగా పోటీ చేస్తే రెండు చోట్లా ఓడించారు అని పవన్ గుర్తు చేశారు. తమిళనాడులో రాజకీయం వేరుగా ఉంటుంది అన్నది. దశాబ్దన్నర కాలం పాటు నలిగిపోయామని ఆయన అన్నారు. ఎంతో ఇబ్బంది పడ్డామని ఆయన చెప్పారు. నాకు మేసేజ్ లను పంపడం కాదు పరిస్థితులు అర్థం చేసుకోవాలని అన్నారు.

పదవులు ముఖ్యం కాదు :

తాను పదవుల విషయంలోనే పట్టుదలగా ఉంటే 2007లో ప్రజారాజ్యంలో యువ రాజ్యం నేతగా ఉన్నపుడే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేవాడిని అన్నారు. అంతే కాదు 2014లో పార్టీ పెట్టినపుడు మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది అన్నారు. తనకు 2007 నుంచి నేను మొదలుపెట్టిన ప్రయాణం 2019 దాకా కొనసాగింది అన్నారు. 2019లో ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే స్థాయికి వచ్చామని అన్నారు. ఒక పార్టీని నడపడానికి బలమైన భావజాలం ఉండాలని అన్నారు.

ఆషామాషీ కాదు :

అధికారంలోకి ఇలా వచ్చి అలా కూర్చోవడం కాదు పార్టీని బలమైన భావజాలంతో నడపాలి అని పవన్ అన్నారు. వామపక్ష నాయకులు ఎంతో నలిగి క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం చేస్తారని అన్నారు. అలాగే కాన్షీరాం వంటి నేతలు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. తాను కూడా పార్టీ ఏర్పాటు తరువాత అనేక కష్టాలు పడ్డాను అని ఆయన అన్నారు. పార్టీ అంటే అందరూ ఎదగాలని నాయకుడిగా ఉంటూ పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆయన కోరారు. జనసేన ఆ విషయంలోనే ముందుకు సాగుతుందని అన్నారు.

పవన్ వ్యాఖ్యలతో :

ఇదిలా ఉంటే విజయ్ పార్టీ గెలుపు చూసి జనసేన నాయకులు చాలా మంది తమ పార్టీ అలాగే చేసి ఉండాలని కోరుకున్నారు దీని మీద డిబేట్లు పెట్టిన వారూ ఉన్నారు. వాటి అన్నింటికీ ఒక్కటే జవాబు అన్నట్లుగా పవన్ పార్టీ వేదిక మీద చెప్పాల్సింది చెప్పారు. తనకు పదవుల కంటే రాష్ట్రం ముఖ్యమని అన్నారు. ఏపీలో రాజకీయం కూడా వేరుగా ఉందని ఆయన అన్నారు. అందుకే తన ఆలోచనలతోనే జనసేన ముందుకు సాగుతుందని ఆయన చెప్పారు. మొత్తానికి గత వారం పది రోజులుగా జనసేన టీవీకేల మధ్య పవన్ విజయ్ ల మధ్య పోలిక పెట్టి విశ్లేషిస్తున్న వారందరికీ పవన్ స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చారు అని అంటున్నారు.