పవన్ కల్యాణ్ శాఖకు అవార్డుల వెల్లువ!
ఏపీలో డిప్యూటీసీఎంగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చూస్తున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అవార్డులు వెల్లువెత్తుతున్నాయి.
By: Garuda Media | 12 May 2026 11:24 PM ISTఏపీలో డిప్యూటీసీఎంగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చూస్తున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అవార్డులు వెల్లువెత్తుతున్నాయి. గత 20 మాసాల కాలంలో ఈ శాఖకు ఏకంగా 19 జాతీయ అవార్డులు రావడం విశేషం. వాస్తవానికి పంచాయతీ రాజ్ వ్యవహారంలో రాజస్థాన్, యూపీ, పంజాబ్లు తొలివరుసలో ఉన్నాయి. దీంతో గత కొన్నాళ్లుగా రాజస్థాన్ అనేక అవార్డులను సొంతం చేసుకుంటోంది. కానీ, పవన్ కల్యాణ్ ఈ శాఖను చేపట్టిన తర్వాత.. కేంద్రం నుంచి వస్తున్న నిధులను నేరుగా పంచాయతీలకు మళ్లిస్తున్నారు.
జవాబుదారీ తనాన్ని పెంచారు. ప్రతి రూపాయికీ లెక్క చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం నుంచి చెరు వులు, నీటి కుంటలు, పశువుల షెడ్లు సహా.. గ్రామీణ ప్రాంతాలకు నిత్యం అవసరం అయ్యే అన్ని సదుపాయాలను కల్పిస్తు న్నారు. అలాగే.. విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల్లోనూ విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. సాగునీటి పారుదలకు అవసరమైన చిన్నపాటి ప్రాజెక్టులకు కూడా ప్రాణం పోస్తున్నారు. అంతేకాదు.. పంచాయతీలు.. రాష్ట్ర ప్రభుత్వంపై ఆధార పడకుండా ఉండేలా ఆర్థిక విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలు, గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. దీంతో జాతీయస్థాయిలో రాష్ట్ర పంచా యతీలకు.. అవార్డుల పంట పండుతోంది. తాజాగా వాతావరణ మార్పులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేసిన పంచాయతీ విభాగంలో రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న కందుల వారి పల్లె పంచాయతీకి జాతీయ అవార్డు లభించింది. పర్యావరణ పరిరక్షణ, నీటి కుంటల ఏర్పాటు, వాతావరణ మార్పులపై చేపట్టిన చర్యలకు ఈ అవార్డు లభించింది. అలానే.. `ఆత్మనిర్భర్` విభాగంలో చిత్తూరులోని కాణిపాకం గ్రామ పంచాయతీ కూడా జాతీయ అవార్డు దక్కించుకుంది. గ్రామాభివృద్ధి, స్వయం సమృద్ధి కార్యక్రమాల అమలులో దూసుకుపోయిన దానికి గుర్తుగా ఈ అవార్డు లభించడం విశేషం.
ఇప్పటి వరకు...
+ చిత్తూరు జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ జాతీయ అవార్డు దక్కించుకుంది. గ్రామీణులకు వివిధ పథకాలపై అవగాహన కల్పించడంతోపాటు.. సమర్థవంతమైన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.
+ 2024-25లో ఒకేరోజు అత్యధిక గ్రామసభలను నిర్వహించిన రాష్ట్రంగా జాతీయ స్థాయిలో రికార్డును దక్కించుకుంది.
+ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో అవార్డులు లభించడం గమనార్హం. మొత్తంగా 19 జాతీయ అవార్డులు లభించాయని పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు.
