Begin typing your search above and press return to search.

మద్యంలో ఎంఆర్పీ ఉల్లంఘనలు.. డిప్యూటీ సీఎం పవన్ సీరియస్!

ఏపీలో మద్యం అమ్మకాల్లో ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారనే విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు కోపం తీసుకువచ్చింది.

By:  Tupaki Political Desk   |   3 Feb 2026 11:00 PM IST
మద్యంలో ఎంఆర్పీ ఉల్లంఘనలు.. డిప్యూటీ సీఎం పవన్ సీరియస్!
X

ఏపీలో మద్యం అమ్మకాల్లో ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారనే విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు కోపం తీసుకువచ్చింది. జనసేన జనరల్ బాడీ సమావేశంలో ఈ అంశం చర్చకు రాగా, రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై తాను సమీక్షిస్తానంటూ ఆయన చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తన అధికారిక పరిధిలో రాకపోయినా, టీడీపీ మంత్రి పర్యవేక్షిస్తున్న ఎక్సైజ్ శాఖపై సమీక్షిస్తానంటూ పవన్ చేసిన ప్రకటన రాజకీయంగా ప్రకంపనలు రేపే అవకాశం ఉందంటున్నారు. నిర్ణీత ధరలు కంటే అధికంగా వసూలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. దీనిని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రకు ట్యాగ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎం.ఆర్.పి కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన సీరియస్ అయినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలో నిబంధనల అతిక్రమనపై ఫిర్యాదులు రాగా, రాష్ట్రం నలుమూలల ఇదే పరిస్థితి ఉందని పార్టీ సీనియర్లు పవన్ దృష్టికి తీసుకువెళ్లారని అంటున్నారు. దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న భావనతో ఈ విషయమై కఠినంగా వ్యవహరించాలని పవన్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రకు సూచిస్తూ ట్వీట్ చేశారు. ఎక్సైజ్ అధికారులు కూడా పకడ్బందీగా పనిచేయాలని ఆదేశించారు.

మద్యం ధరలపై పవన్ జోక్యం కూటమి పార్టీల్లో విస్తృత చర్చకు కారణమవుతోంది. రాష్ట్రంలో చాలా చోట్ల మద్యం బాటిల్ పై అదనంగా రూ.10 వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరించడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం కూటమి ఎమ్మెల్యేలే అంటున్నారు. రాష్ట్రంలో 90 శాతం మంది కూటమి ఎమ్మెల్యేలకు మద్యం వ్యాపారంతో లింకులు ఉండటం వల్ల అధికారులు కఠినంగా వ్యవహరించలేకపోతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

కూటమిలోని టీడీపీతోపాటు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు మద్యం వ్యాపారంతో సంబంధం ఉందని అంటున్నారు. మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించిన సమయంలో 20 శాతం కమీషన్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మద్యం దుకాణాలు కేటాయించిన తర్వాత కమీషన్ మొత్తాన్ని ఏకపక్షంగా 14 శాతానికి తగ్గించినట్లు చెబుతున్నారు. దీనివల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాట తప్పడం వల్లే తాము నష్టపోవాల్సివస్తోందని అంటున్నారు. అయితే కూటమి ఎమ్మెల్యేలు భాగస్వామ్యం ఉన్న దుకాణదారులు మాత్రం ఈ నష్టం నుంచి తప్పించుకోడానికి బాటిల్ పై రూ.10 అదనంగా వసూలు చేయాలని దుకాణదారులకు అనధికారికంగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులను కూడా ఎమ్మెల్యేలు నియంత్రిస్తుండటంతో విచ్చలవిడిగా ఎంఆర్పీ ఉల్లంఘనలు నమోదు అవుతున్నాయని అంటున్నారు.

ఇప్పుడు పవన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఎమ్మెల్యేల ప్రమేయాన్ని నియంత్రించడం డిప్యూటీ సీఎం పవన్ కు సాధ్యమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అదే సమయంలో పంచాయతీ రాజ్ పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టీడీపీకి చెందిన మంత్రి కొల్లు రవీంద్ర చూస్తున్న ఎక్సైజ్ శాఖ వ్యవహారాల్లో తలదూర్చడం కూడా ఇంట్రస్టింగు టాపిక్ గా మారింది. మంత్రి కొల్లు ఈ విషయంలో ఎలా స్పందిస్తారన్నది కూడా చర్చకు తావిస్తోంది. మొత్తానికి ఎక్సైజ్ శాఖలో అధిక ధరలకు మద్యం అమ్మకాలు అనే తేనె తుట్టెను డిప్యూటీ సీఎం పవన్ కదిలించారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇది రాజకీయంగా చాలా సున్నితమైన అంశమని, పవన్ ఎలా డీల్ చేస్తారో చూడాల్సివుందని వ్యాఖ్యానిస్తున్నారు.