Begin typing your search above and press return to search.

కోడి చెరువు కబ్జా వెనుక అసలు నిజం ఇదే.. పవన్ కళ్యాణ్‌పై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ

తెలంగాణలోని జన్వాడ ప్రాంతంలో ఉన్న 'కోడి చెరువు' కబ్జాకు గురైందంటూ.. అందులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రమేయం ఉందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలోనూ.. రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  A.N.Kumar   |   21 July 2026 12:20 PM IST
కోడి చెరువు కబ్జా వెనుక అసలు నిజం ఇదే.. పవన్ కళ్యాణ్‌పై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ
X

తెలంగాణలోని జన్వాడ ప్రాంతంలో ఉన్న 'కోడి చెరువు' కబ్జాకు గురైందంటూ.. అందులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రమేయం ఉందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలోనూ.. రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై నెలకొన్న అనుమానాలను, వివాదాలను పటాపంచలు చేస్తూ "హైడ్రా" కమిషనర్ ఏవీ రంగనాథ్ ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ కోడి చెరువును కబ్జా చేశారంటూ వస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవాలని.. వాటిలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. హైడ్రా నిర్వహించిన ప్రాథమిక పరిశీలన, విచారణ నివేదికల ఆధారంగా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ క్రింది కీలక విషయాలను వెల్లడించారు:

- చట్టబద్ధమైన కొనుగోలు

జన్వాడ కోడి చెరువు పరిసర ప్రాంతంలో పవన్ కళ్యాణ్‌కు కొంత భూమి ఉన్న మాట వాస్తవమేనని, అయితే ఆ భూమిని ఆయన 2014లోనే అన్ని చట్టబద్ధమైన నిబంధనలకు లోబడి కొనుగోలు చేశారని కమిషనర్ తెలిపారు. ఆ నివేదికల ప్రకారం భూమి కొనుగోలు వ్యవహారంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టమైంది.

- చెరువు స్వరూపంలో మార్పుల్లేవు

సదరు స్థలంలో కొన్ని ఎకరాలు ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలోకి వస్తున్నట్లు గుర్తించినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆ చెరువును ఆక్రమించడం కానీ అందులో మట్టి నింపి పూడ్చివేయడం కానీ చేయలేదని హైడ్రా పేర్కొంది. చెరువు అసలు స్వరూపం దెబ్బతినకుండా అలాగే ఉందని.. నీటి నిల్వ సామర్థ్యానికి లేదా నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించేలా ఎలాంటి నిర్మాణాలు అక్కడ చేపట్టలేదని స్పష్టం చేశారు.

- మట్టి పూడ్చింది ఇతరులే!

చెరువులో మట్టి నింపిన అంశంపై విచారణ చేయగా అసలు నిజాలు బయటపడ్డాయి. మట్టి నింపిన చర్యలకు పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి సంబంధం లేదని, చెరువు పక్కనే ఉన్న ఇతర భూయజమానులే ఈ పనికి పాల్పడినట్లు విచారణలో తేలిందని రంగనాథ్ తెలిపారు. ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇచ్చిన అధికారిక క్లారిటీతో కోడి చెరువు వివాదానికి తెరపడినట్లయింది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఉద్దేశపూర్వకంగా జరిగిన దుష్ప్రచారానికి ఈ వ్యాఖ్యలు చెక్ పెట్టినట్లయింది. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ అంశంలో అధికారిక విచారణ వివరాలు బయటకు రావడంతో పవన్ మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.