ప్రింట్ కాని పుస్తకంపై రచ్చ.. రాహుల్ పరువు తీసిన కేంద్రం!
భారత్-చైనా సరిహద్దులైన లద్ధాఖ్, డొక్లాంలలో 2020-22 మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.
By: Garuda Media | 3 Feb 2026 1:00 AM ISTకాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో విపక్ష నాయకుడుగా కూడా ఉన్న రాహుల్గాంధీ తన తీరును మార్చుకోలేక పోతున్నారన్న వాదన వినిపిస్తోంది. గత కొన్నాళ్లుగా ఆయన గ్రాఫ్ పతనం అవుతోందే తప్ప.. ఎక్కడా పుంజుకోవడం కూడా లేదు. అయిన ప్పటికీ.. తన పంథాలో ఎక్కడా మార్పు దిశగా రాహుల్గాంధీ అడుగులు వేయలేక పోతున్నారు. తాజాగా పార్లమెటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. సోమవారం లోక్సభలో రాహుల్గాంధీ ప్రస్తావించిన కీలక విషయం.. ఆయనకే ఎదురు తిరిగింది. అంతేకాదు.. `పార్లమెంటు రూల్స్ ఏంటో తెలుసుకోండి సర్` అంటూ.. స్పీకర్ ఓం బిర్లా ఆయనను సునిశితంగా మందలించారు.
ఏం జరిగింది?
భారత్-చైనా సరిహద్దులైన లద్ధాఖ్, డొక్లాంలలో 2020-22 మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా విశేషాలను వెల్లడిస్తూ.. మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ నరవణే ఓ పుస్తకంలో పేర్కొన్నారు. అయితే.. ఈ పుస్తకం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఎవరూ ప్రింటు కూడా చేయలేదు. ఈ విషయాన్ని తాజాగా రాహుల్గాంధీ లోక్సభలో ప్రశ్నించారు. చైనా విషయంలో భారత్ ఎక్కడో వీక్గా వ్యవహరిస్తోందని, దీనిపై అంతర్జాతీయ ప్రభావం ఉందని కూడా నోరు చేసుకున్నారు. వాస్తవానికి భారత్ నూతన విదేశాంగ విధానం అనుసరిస్తోంది. ఈ క్రమంలో కవ్వింపుల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తూ.. ప్రపంచ దేశాల ముందు.. ప్రత్యర్ధి దేశాల పరువు తీస్తోంది. ఎంతో అవసరం అయితే తప్ప.. దాడులు చేయడం లేదు.
ఈ నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అధికార బీజేపీ అగ్రనేతలు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి అమిత్ షాలు నిప్పులు చెరిగారు. పార్లమెంటులో పత్రికలు, పుస్తకాల ప్రస్తావన తీసుకురావడమే తప్పని వ్యాఖ్యానించారు. పోనీ.. ఒక వేళ తీసుకువచ్చినా.. సదరు పుస్తకం ప్రింట్ అయిందా? అని నిలదీశారు. కానీ, అది ఇంకా ప్రాధమిక దశలోనే ఉందని అధికారు లు తెలిపారు. దీంతో రాహుల్ను వారిద్దరూ ఏకపక్షంగా ఏకేశారు. దీంతో సభలో సుమారు 40 నిమిషాలకుపైగా ఇరు పక్షాల మధ్య అరుపులు, కేకలు చోటు చేసుకున్నాయి. రాహుల్ వ్యవహార శైలిని బీజేపీ ఎంపీలు కూడా తప్పుబట్టారు.
ఈ సమయంలో జోక్యం చేసుకున్న స్పీకర్ ఓం బిర్లా.. పార్లమెంటు రూల్స్ బుక్లో ఉన్న పాయింట్లను చదవి రాహుల్కు వినిపించారు. రూల్స్ తెలుసుకోవాలని.. ఆయనను సునిశితంగా మందలించారు. పార్లమెంటులో ప్రస్తావించే ఏ అంశం అయినా.. పత్రికలు, వీడియోలు, పుస్తకాలకు సంబంధించి ఉండరాదని.. ఆయన పేర్కొన్నారు. అయితే.. రాహుల్ తన వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ఆయనకు మైక్ కట్ చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. రాహుల్ వాదన ఏంటంటే.. నరవణే చేసిన వ్యాఖ్యలను(ప్రచురితం కాని పుస్తకంలో) ఓ మ్యాగజైన్ ప్రచురించిందని. కానీ, అది కూడా వెలుగు చూడలేదన్నది బీజేపీ మాట.
