Begin typing your search above and press return to search.

ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. అదంతా నో మైనింగ్ జోన్‌!

ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త రెండు మాసాలుగా తీవ్ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు వ‌స్తున్న ఉమ్మ‌డి విశాఖ జిల్లాలోని పంచదార్ల కొండ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్‌గా ప్ర‌క‌టిస్తూ.. గురువారం ఉత్త‌ర్వు లు జారీ చేసింది.

By:  Garuda Media   |   28 Aug 2026 8:32 AM IST
ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. అదంతా నో మైనింగ్ జోన్‌!
X

ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త రెండు మాసాలుగా తీవ్ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు వ‌స్తున్న ఉమ్మ‌డి విశాఖ జిల్లాలోని పంచదార్ల కొండ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్‌గా ప్ర‌క‌టిస్తూ.. గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 150కి పైగా హెక్టార్ల భూమిలో ఎలాంటి మైనింగ్ కార్య‌క‌లాపాలు జ‌ర‌ప‌రాద‌ని పేర్కొంది. దీనికి సంబంధించి మైనింగ్ అధికారుల‌కు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇస్తున్న‌ట్టు తెలిపింది. దీంతో అక్క‌డ ప్ర‌త్యేక ప‌హారా ఏర్పాటు చేయ‌నున్నారు.

ఏం జ‌రిగింది?

ఉమ్మ‌డి విశాఖ ప‌రిధిలోని అనకాపల్లిలోని రాంబిల్లి మండలంలో ఐదు కొండల నుంచి ఏడాది పొడవునా సహజ జలధారలు నిరంతరాయంగా ప్రవహిస్తుంటాయి. దీనివ‌ల్లే.. ఈ ప్రాంతానికి 'పంచదార్ల కొండ' అనే పేరు వచ్చింది. ఆధ్యాత్మికంగా కూడా.. ఈ ప్రాంతానికి ప్రాధాన్యం ఉంది. ఈ కొండ దిగువన ప్రసిద్ధ ఉమా ధర్మలింగేశ్వర స్వామి పురాతన ఆలయం ఉంది. ఇక్కడ భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు.

అయితే.. పంచ‌దార్ల కొండ ప్రాంతంలో గ‌త రెండు మాసాలుగా భారీ ఎత్తున త‌వ్వ‌కాలు జ‌రిగాయి. ఇక్క‌డి మ‌ట్టి, రాళ్ల‌ను కొంద‌రు నేత‌లు.. అక్ర‌మంగా త‌వ్వుతున్న‌ట్టు వార్త‌లు కూడా వ‌చ్చాయి. దీనిపై క‌మిటీని వేసిన సీఎం చంద్ర‌బాబు.. నివేదిక ఆధారంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని గ‌త నెల‌లోనే ప్ర‌క‌టించారు. అయిన‌ప్ప‌టికీ త‌వ్వ‌కాలు ఆగ‌క‌పోవ‌డం.. కేసు కోర్టు వ‌ర‌కు వెళ్ల‌డంతో ముంద‌స్తుగానే తాజాగా ప్ర‌భుత్వం ఇక్క‌డ నో మైనింగ్ జోన్‌ను ప్ర‌క‌టిస్తూ.. కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఎవ‌రి పాత్ర ఎంత‌?

పంచ‌దార్ల కొండ త‌వ్వ‌కాల వెనుక ఓ కీల‌క ప్ర‌జాప్ర‌తినిధి ఉన్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆయ‌న కూట‌మిలోని ఓ పార్టీకి చెందిన నాయ‌కుడ‌ని.. ఆయ‌న‌కు కొంద‌రు వైసీపీ నాయ‌కులు కూడా మ‌ద్ద‌తుగా నిలిచార‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో స‌ర్కారుకు తొలినాళ్ల‌లో ఇబ్బందులు వ‌చ్చాయి. అయితే.. హైకోర్టు దీనిపై విచార‌ణ‌కు రెడీ అవుతున్న నేప‌థ్యంలో మ‌రిన్న ఇబ్బందులు రావ‌డం త‌థ్య‌మ‌ని భావించిన ప్ర‌భుత్వం వెంట‌నే నో మైనింగ్ జోన్‌గా ప్ర‌క‌టిస్తూ.. ఉత్త‌ర్వులు జారీ చేసింది.