పల్నాడు పాలిటిక్స్: తమ్ముళ్లలో అసంతృప్తే... !
పల్నాడు రాజకీయాల్లో టీడీపీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నియోజకవర్గాల్లో బలమైన నాయకులు ఉన్నారు.
By: Garuda Media | 21 March 2026 5:00 AM ISTపల్నాడు రాజకీయాల్లో టీడీపీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నియోజకవర్గాల్లో బలమైన నాయకులు ఉన్నారు. వినుకొండ, గురజాల, మాచర్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట నియోజకవర్గాలు కీలకం. గతంలో అనేక సార్లు మాచర్లలో టీడీపీ పరాజయం ఎదుర్కొంది. కానీ.. గత ఎన్నికల్లో ఈ పరాభవం నుంచి బయట కు వచ్చింది. విజయం సాధించింది. ఇక, సత్తెనపల్లి, చిలకలూరిపేట, గురజాలలో అనుకున్నట్టుగానే పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది.
అయితే.. పల్నాడులో ఇంత బలంగాఉన్నప్పటికీ.. కీలక స్థానాలు దక్కించుకున్నప్పటికీ.. నాయకులకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని.. తమ్ముళ్లు వాపోతున్నారు. వీటిలో ఒక నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత.. మంత్రి వర్గంలో సీటు కోసం ఆరాటపడుతున్నారు. ఆయన అన్నింటికీ అర్హుడేనని పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు. కేవలం వినుకొండ ఎమ్మెల్యేకు మాత్రమే అసెంబ్లీలో చీఫ్ విప్ పదవిని ఇచ్చారు.
ఇతర నియోజకవర్గాలకు ఈ అవకాశం కూడా దక్కలేదు. కానీ, ఈ నియోజకవర్గాల గ్రాఫ్ను చూస్తే.. బలమై న పోస్టు ఇవ్వడం ద్వారా.. ఆయా నియోజకవర్గాల్లో మరింతగా పార్టీ పుంజుకునేందుకు అవకాశం ఉంటుం దన్న అంచనాలు వస్తున్నాయి. ముఖ్యంగా మాచర్లలో అయితే.. ఈ వాదన మరింత ఎక్కువగా వినిపిస్తోం ది. మంత్రివర్గం సీటు కోసం.. మాచర్ల ఎమ్మెల్యే తెరచాటున ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. గతంలో పల్నాడు ప్రాంతానికి.. వైసీపీ మంత్రిపదవి ఇచ్చిందని(అంబటి రాంబాబు).. ఇప్పుడు ఎందుకు తాత్సారం చేస్తున్నారన్నది ఆయన వాదన.
ఇక, వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి ఒక ఎమ్మెల్యే తప్పుకుంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు.. సత్తెనపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా.. ఇదే తనకు చివరి ఛాన్స్ అని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాకున్నా సంతోషమేనని కానీ.. తనకు ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాలని కీలక నాయకుల ద్వారా వర్తమానం పంపించినట్టు తెలిసింది. ఇలా.. నియోజకవర్గాల వారీగా.. పల్నాడులో నాయకులు కీలక పదవులపై ఆశలు పెట్టుకున్నారు.
