Begin typing your search above and press return to search.

నిన్న శత్రువులు.. నేడు దేశభక్తులు.. పీఓకే నిరసనకారులపై పాక్ యూటర్న్

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో రగిలిన ప్రజా ఆగ్రహం పాకిస్థాన్ ప్రభుత్వాన్ని తీవ్ర ప్రతిరక్షణలో పడేసింది.

By:  A.N.Kumar   |   10 Aug 2026 9:21 AM IST
నిన్న శత్రువులు.. నేడు దేశభక్తులు.. పీఓకే నిరసనకారులపై పాక్ యూటర్న్
X

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో రగిలిన ప్రజా ఆగ్రహం పాకిస్థాన్ ప్రభుత్వాన్ని తీవ్ర ప్రతిరక్షణలో పడేసింది. గత కొంతకాలంగా తమ కనీస హక్కులు, ఆర్థిక సదుపాయాల కోసం వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్న ప్రజలపై తీవ్ర అణచివేత ధోరణి ప్రదర్శించిన పాక్ ప్రభుత్వం.. ఇప్పుడు హఠాత్తుగా మాట మార్చింది. ఇప్పటివరకు నిరసనకారులను 'దేశ వ్యతిరేకులు', 'దేశ శత్రువులు' అని తీవ్రంగా దూషించిన పాకిస్థాన్ పాలకులు.. తాజాగా వారందరూ 'దేశభక్తులే' అని సర్టిఫికేట్ ఇవ్వడం అంతర్జాతీయంగా.. రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

నిరసనకారులపై రాణా సనావుల్లా వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్‌ సలహాదారు రాణా సనావుల్లా చేసిన వ్యాఖ్యలు ఈ సంచలన యూటర్న్‌కు కారణమయ్యాయి. పీఓకేలో ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జాక్) నేతలతో చర్చలు జరిపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఆందోళనల్లో పాల్గొంటున్న ప్రజల్లో 99 శాతం మంది పక్కా దేశభక్తులేనని ఆయన పేర్కొనడం గమనార్హం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని.. వారితో చర్చించి త్వరలోనే సత్వర పరిష్కారం కనుగొంటామని రాణా సనావుల్లా స్పష్టం చేశారు.

పీఓకేలో ప్రజల ఆందోళనకు ప్రధాన కారణాలు

పీఓకే ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న దారుణమైన ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ పాలనా లోపాలు ఈ ఆందోళనలకు మూలకారణంగా నిలిచాయి. నిరంతరం పెరుగుతున్న కరెంట్ బిల్లుల భారం సామాన్యుల నడుము విరుస్తోంది. ప్రజలపై విపరీతంగా అదనపు పన్నులు విధించడం ఆగ్రహానికి కారణమైంది. ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. స్థానిక వనరులు, ప్రాథమిక హక్కుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

ఈ సమస్యలన్నింటిపై జాక్ ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. నిరసనలు తీవ్రరూపం దాల్చడం.. ప్రభుత్వంపై అంతర్జాతీయ స్థాయిలోనూ ఒత్తిడి పెరగడంతో అణచివేత చర్యలకు స్వస్తి చెప్పి చర్చల మార్గాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి పాకిస్థాన్‌కు ఏర్పడింది.

రాజకీయ పరిణామాలు.. ఎన్నికల అక్రమాల ఆరోపణలు

ఈ ప్రజా ఉద్యమం వెనుక రాజకీయ అసంతృప్తి కూడా దాగి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీఓకేలో ఉన్న మొత్తం 45 అసెంబ్లీ స్థానాల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ 25 స్థానాలను గెలుచుకుని అధికారాన్ని చెలాయిస్తోంది.

అయితే ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్, దొంగ ఓట్లు, తీవ్రమైన అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు, స్థానిక విమర్శకులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఏర్పడిన తీవ్రమైన అపనమ్మకం, దానికి తోడు రోజురోజుకీ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు కలగలసి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజా తిరుగుబాటుకు దారితీశాయి.

నిరసనలను అణచివేస్తే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందనే గ్రహింపుతోనే పాక్ ప్రభుత్వం అకస్మాత్తుగా మెత్తబడి నిరసనకారులను 'దేశభక్తులు'గా అభివర్ణించే వ్యూహాన్ని అమలు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

నిజమైన పరిష్కారమా.. కాలయాపనా?

ప్రస్తుతం జాక్ నేతలతో పాక్ ప్రభుత్వం జరిపే చర్చలు ఏ దిశగా సాగుతాయి? నిరసనకారుల ప్రధాన డిమాండ్లయిన విద్యుత్ ఛార్జీల తగ్గింపు, పన్నుల ఉపసంహరణపై పాక్ ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన హామీ ఇస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన ఈ చర్చల ప్రక్రియ పీఓకే ప్రజల కష్టాలను నిజంగా తీరుస్తుందా.. లేక తాత్కాలికంగా ఆందోళనలను శాంతింపజేసి తీవ్రతను తగ్గించేందుకు ఆడిన రాజకీయ నాటకమా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.