Begin typing your search above and press return to search.

ఇక పాకిస్తాన్ తో డ్రోన్ యుద్ధానికి భారత్ సర్వసన్నద్ధం

భారత రక్షణ వ్యవస్థలు డ్రోన్ల ఆధునిక యుద్ధ వ్యూహాలను అభివృద్ధి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాయి.

By:  A.N.Kumar   |   24 Sept 2025 3:00 PM IST
ఇక పాకిస్తాన్ తో డ్రోన్ యుద్ధానికి భారత్ సర్వసన్నద్ధం
X

భారత రక్షణ వ్యవస్థలు డ్రోన్ల ఆధునిక యుద్ధ వ్యూహాలను అభివృద్ధి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ 6 నుంచి 10 వరకు మధ్యప్రదేశ్‌లో జరగనున్న భారీ సైనిక విన్యాసాలు దేశానికి నూతన రక్షణ ధోరణులను ప్రదర్శిస్తాయి. ఈ విన్యాసాలు సమీకృత రక్షణ విభాగం (IDS) ఆధ్వర్యంలో జరుగుతున్నవి, ఇందులో భూ, నౌకా, గగన సైన్యాల త్రివిధ దళాలు తమ సామర్థ్యాలను సమగ్రంగా పరీక్షిస్తాయి.

ఈ విన్యాసాలు ప్రత్యేకత ఏమిటంటే.. దేశంలో ఉన్న ఆధునిక డ్రోన్లు , శత్రు డ్రోన్లను గుర్తించడం, ఎదుర్కోవడం వంటి వ్యూహాలను అమలు చేయడం జరుగుతుంది. ఈ దశలో భాగంగా భారత్, పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తరువాత, త్రివిధ దళాల సమిష్టి ప్రయత్నంలో మొదటి సారిగా డ్రోన్ వ్యతిరేక విన్యాసాలు నిర్వర్తించబడుతున్నాయి.

*ఆపరేషన్ సిందూర్ పాఠాలు

ఐడీఎస్ ఉపాధిపతి ఎయిర్ మార్షల్ రాకేష్ సిన్హా, దిల్లీలో జరిగిన గగనతల రక్షణ సదస్సులో ఆపరేషన్ సిందూర్ అనంతరం బయటపడిన కీలక అంశాలను వివరించారు. ఆపరేషన్ అనంతరం పాకిస్థాన్ భారీ సంఖ్యలో డ్రోన్లతో ప్రతిచర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. ఈ సంఘటన భారత సైన్యానికి డ్రోన్లను గుర్తించడం, నాశనం చేయడం వంటి సాంకేతిక సామర్థ్యాలపై మరింత దృష్టి పెట్టడానికి కారణమైంది.

* భవిష్యత్ వ్యూహం – కొత్త టెక్నాలజీతో

రాకేష్ సిన్హా మాట్లాడుతూ “మన సైనిక వ్యూహాల్లో శత్రువుకంటే ఎల్లప్పుడూ ఒక అడుగు ముందుండాలి. డ్రోన్లను అడ్డుకునే వ్యవస్థలను వేగంగా అభివృద్ధి చేయడం అత్యవసరం. ఈ ప్రక్రియలో పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, విద్యా సంస్థల భాగస్వామ్యం కీలకమైనది” అన్నారు.

*పరిశ్రమలు, శాస్త్రీయ సంస్థల భాగస్వామ్యం

ఈ విన్యాసాల్లో త్రివిధ దళాలతో పాటు పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, విద్యా సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటారు. ఈ సమిష్టి ప్రయత్నం దేశ గగనతల రక్షణను బలోపేతం చేయడమే కాకుండా.. స్వదేశీ డ్రోన్ సాంకేతికత అభివృద్ధికి దోహదం చేస్తుంది.

భారత సైన్యం ఈ విన్యాసాల ద్వారా భవిష్యత్ యుద్ధాలకు తగిన విధంగా సన్నద్ధమవుతూ, డ్రోన్ ఆధారిత యుద్ధ వ్యూహాల్లో తన సామర్థ్యాన్ని ప్రపంచానికి మళ్లీ చాటనుంది. ఇది కేవలం డ్రోన్ల వ్యూహాలను మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో భారత్ సైన్య సామర్థ్యానికి కూడా ఒక స్పష్టమైన సంకేతం.