ట్రంప్ పై ఒబామా సెటైర్.. అదిరిపోలా..
లండన్లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
By: A.N.Kumar | 29 Sept 2025 1:13 AM ISTలండన్లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బ్రిటిష్ చరిత్రకారుడు డేవిడ్ ఒలుసొగాతో జరిగిన సంభాషణలో ఒబామా నేరుగా పేర్లు ప్రస్తావించకపోయినా, ఆయన వ్యాఖ్యలు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించాయని అందరూ భావిస్తున్నారు.
ప్రపంచ సమస్యలకు కారణం వృద్ధ నేతలే!
ఒబామా మాట్లాడుతూ “ప్రపంచ సమస్యల్లో 80 శాతం వృద్ధ నేతలు అధికారాన్ని పట్టుకుని వదలకుండా వేలాడడం వల్లే వస్తున్నాయి. వారు ఏదీ వదులుకోరు. మరణానికి భయపడి అధికారాన్ని గట్టిగా పట్టుకుని ఉంటారు. పిరమిడ్లు కడతారు, ప్రతిదానిపైనా తమ పేర్లను చెక్కిస్తారు” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు 77 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ట్రంప్పైనే లక్ష్యంగా చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని 2019లోనూ ఒబామా ప్రస్తావిస్తూ “సాధారణంగా వృద్ధ నేతలు అధికారం నుంచి బయటకు రావడం చాలా అరుదు” అని చెప్పడం గమనార్హం.
ట్రంప్ వ్యాఖ్యలపై కౌంటర్
ఇదే కార్యక్రమంలో ట్రంప్ చేసిన మరో వివాదాస్పద వ్యాఖ్యను కూడా ఒబామా తప్పుబట్టారు. ట్రంప్ ఇటీవల “పారాసెటమాల్ (టైలెనాల్) వాడితే గర్భస్థ శిశువులు ఆటిజానికి గురవుతారు” అని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపై స్పందించిన ఒబామా “ఇది పూర్తిగా అసత్యం. ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడతాయి. ముఖ్యంగా గర్భిణిలకు హాని కలిగిస్తాయి. ఆటిజంతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు అనవసరమైన భయాందోళన కలిగిస్తాయి” అని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో వైరల్
ఒబామా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా “వృద్ధ నేతలే ప్రపంచ సమస్యలకు మూలం” అన్న మాట యువతలో విపరీతంగా షేర్ అవుతోంది. ట్రంప్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా, ఆయనను ఉద్దేశించే వ్యంగ్యంగా ఇవి మారాయని నిపుణులు చెబుతున్నారు.
మొత్తంగా, ఒబామా వ్యాఖ్యలు మరోసారి అమెరికా రాజకీయాల్లో ట్రంప్-ఒబామా విభేదాలను తెరపైకి తెచ్చాయి.
