సమావేశానికి గంట లేటు.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే!
కానీ.. అందరిలో ఒక్కడిగా కాకుండా.. ప్రత్యేకంగా వ్యవహరించే కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. తాజాగా ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని ఓ సమావేశానికి వచ్చారు.
By: Garuda Media | 13 Sept 2026 2:59 PM ISTసాధారణంగా నాయకులు, మంత్రులు ఏదైనా సభలు సమావేశాలకు రావాలంటే.. షెడ్యూల్ ప్రకారం కుదిరేది కాదు కనీసంలో కనీసం.. అరగంట ఆలస్యమైతే తప్ప.. వారు వచ్చినట్టు ఉండదు.. జనాలు మెచ్చినట్టు కూడా ఉండద న్న నానుడి ఉంది. అయితే.. ఇటీవల కాలంలో సాంకేతికత పెరగడంతో ఈ సమయాభావం తగ్గుతూ వస్తోంది. అయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో మంత్రుల రాక ఆలస్యమవుతోంది. కానీ.. అందరూ ఈ సమయాభావాన్ని లైట్ తీసుకుంటున్నారు.
కానీ.. అందరిలో ఒక్కడిగా కాకుండా.. ప్రత్యేకంగా వ్యవహరించే కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. తాజాగా ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని ఓ సమావేశానికి వచ్చారు. అయితే ఆయన షెడ్యూల్ ప్రకారం సమావేశానికి రాలేక పోయారు. గంటా 12 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నారు. సహజంగా ఇలాంటి సందర్భాల్లో మంత్రులు లైట్ తీసుకుంటారు. కానీ, గడ్కరీ మాత్రం.. తన ఆలస్యపై సుమారు 5 నిమిషాల పాటు పశ్చాత్తాపం ప్రకటించారు. దీనికి తాను మూల్యం చెల్లించుకున్నానని అన్నారు.
ఇక, ఈ ఆలస్యానికి కారణం.. వర్లీ నుంచి ముంబైకి వచ్చే క్రమంలో ఏర్పడిన ట్రాఫిక్ జామేనని మంత్రి వివరించారు. కానీ, ఇది గతంలో తాను చేసిన తప్పు కారణంగానే జరిగిందన్నారు. తాను గతంలో మహారాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు.. రహదారులు, వంతెనల నిర్మాణం చేపట్టానని.. అయితే.. అప్పట్లో ఇంత భారీగా జనాలు పెరుగుతారని తాను ఊహించలేదని.. అందుకే.. కొంత మేరకు ఆయా నిర్మాణాల విషయంలో రాజీ పడాల్సి వచ్చిందని తెలిపారు.
ఆనాడు తాను రాజీ పడడంతో ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా.. ప్రస్తుతం అధునాతన సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయని.. దీంతో నిర్మాణ సమయం తగ్గుతోందని.. అలాగే సాంకేతికత సాయంతో విస్తృతమైన పనులు కూడా జరుగుతున్నాయని వివరించారు. భవిష్యత్తులో చేపట్టే పనులకు.. ఈవిషయాలను పరిగణనలోకి తీసుకోవాలని గడ్కరీ సూచించారు. కాగా.. మంత్రి లేటుగా రావడం ఎలా ఉన్నా.. ఆయన 5 నిమిషాలకుపైగా తన వివరణ ఇవ్వడంతో సభికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
