నగరాలకు 'తిండి' పిచ్చి.. నిమిషానికి 100 ఆర్డర్లు!
ఔను.. మీరు చదివింది నిజమే. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లోని ప్రజలకు 'తిండి' పిచ్చి పట్టిందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓ సర్వే సంస్థ వెల్లడించింది.
By: Garuda Media | 16 Aug 2025 8:30 AM ISTఔను.. మీరు చదివింది నిజమే. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లోని ప్రజలకు 'తిండి' పిచ్చి పట్టిందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓ సర్వే సంస్థ వెల్లడించింది. అంతేకాదు.. ప్రతి నిమిషానికీ 100కు తక్కువకాకుండా ఆర్డర్లు ఉంటున్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా చేసిన సర్వే తాలూకు నివేదిక ను తాజాగా జాతీయ ఆహార మంత్రిత్వ శాఖ వెలువరించింది. దీని ప్రకారం.. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కతా, విజయవాడ, విశాఖ, తిరుపతి, భోపాల్, ఇండోర్, జైపూర్ సహా అన్ని రాష్ట్రాల్లో ని ప్రధాన నగరాల్లో ప్రజలు తిండి పిచ్చితో ఉన్నారని పేర్కొనడం గమనార్హం.
ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రతి టీనేజర్ తన సెలఫోన్లో చాట్ మసాలా స్టాళ్ల కోసం ఎక్కువగా వెతుకుతున్నారు. అమ్మాయిలు కూడా.. పానీపూరీ.. సహా.. ఇతర తినుబండారాల కోసం ఆన్లైన్లో తెగ గాలిస్తున్నట్టు సర్వేలో స్పష్టంగా తెలిసింది. ఎక్కువ మంది అప్పటికప్పుడు తయారు చేసిన ఫుడ్ కోసం ఆర్డర్లు ఇస్తున్నారు. అంతేకాదు.. ఆర్డర్లకు సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు.. కూడా బిజీబిజీగా ఉంటున్నట్టు సర్వే తెలిపింది.
దక్షిణాది ఫుడ్ కోసం ఉత్తరాది ప్రజలు, ఉత్తరాది చాట్ మసాలా, రోటీల కోసం దక్షిణాది ప్రజలు విరివిగా ఆర్డర్లు ఇస్తున్నారని.. ఈ సర్వే పేర్కొంది. ప్రధానంగా మధ్యవయస్కులు.. ఉద్యోగులు, విద్యార్థినులు ఎక్కు వగా ఆర్డర్లు ఇస్తున్నారని, ఉదయం టిఫిన్ నుంచి సాయంత్రం స్నాక్స్ వరకు కూడా ఆర్డర్లు ఇస్తున్నట్టు సర్వే వివరించింది. ఇక, సమీపంలోని రెస్టారెంట్లకు కొందరు ప్రాధాన్యం ఇస్తుంటే.. రుచి శుచికి ప్రాధాన్యం ఇస్తున్న వారు.. దూరాభారంతో సంబంధం లేకుండా ఆర్డర్లు చేస్తున్నారని.. తెలిపింది. ప్రస్తుతం మొబైల్ ఫోన్లలో ఎక్కువగా ఆహారానికి సంబంధించిన డెలివరీ యాప్లే ఉంటున్నాయని పేర్కొంది.
మొత్తంగా ఒకప్పుడు.. రాజకీయాలు, క్రీడలు, ఇతర అంశాలపై ఎంతో శ్రద్ధ పెట్టిన యువత, మధ్యతరగతి వర్గం కూడా.. నేడు.. ఆహారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు సర్వే పేర్కొనడం గమనార్హం. అంతేకాదు.. రెస్టారెం ట్లలో ఎలాంటి పదార్ధాలు వాడుతున్నారు..? ఏ నూనెలు వాడుతున్నారు? అనే విషయాలను కూడా పట్టిం చుకోవడం లేదని, కేవలం రుచికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని సర్వే వెల్లడించింది. అదేసమయం లో ధరలను కూడా ఎవరూ లెక్క చేయడం లేదని తెలిపింది. ఈ సర్వేను మొత్తం 12 ప్రధాన నగరాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటలవరకు నిర్వహించారు.
