Begin typing your search above and press return to search.

90ల నాటి రోజులొస్తున్నాయి.. వందల కుటుంబాలు రేయంతా బీచ్‌లో జాగారం!

మైదానంలో వందలాది మంది ప్రజలు నిద్రిస్తుండటాన్ని గమనించిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) నగర అధ్యక్షుడు సందీప్ రాణే నాయకత్వంలోని ప్రతినిధి బృందం అక్కడ తనిఖీలు నిర్వహించింది.

By:  Sivaji Kontham   |   18 Jun 2026 9:05 AM IST
90ల నాటి రోజులొస్తున్నాయి.. వందల కుటుంబాలు రేయంతా బీచ్‌లో జాగారం!
X

ముంబై మహానగరం ప్రస్తుతం అసాధారణమైన, అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత రెండు నెలలుగా నగరంలో ఉష్ణోగ్రతలు - తేమ (హ్యుమిడిటీ) రికార్డు స్థాయిలో పెరిగిపోవడంతో ప్రజల జీవనం దుర్భరంగా మారింది. ఈ విపరీతమైన వేసవి తాపం నుండి తాత్కాలిక ఉపశమనం పొందేందుకు వందలాది కుటుంబాలు తమ ఇళ్లను వదిలి రాత్రి వేళల్లో బహిరంగ ప్రదేశాలకు తరలివస్తున్నాయి. ముఖ్యంగా ముంబైలోని `వెర్సోవా బీచ్`లో అర్ధరాత్రి వేళల్లో వందల సంఖ్యలో జనం పరుపులు, చాపలు వేసుకుని తీరం వెంబడి నిద్రిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ హృదయవిదారక దృశ్యాలు 1990ల కాలం నాటి పాత రోజులను.. నాటి తీవ్ర ఉష్ణోగ్రతల పరిస్థితులను గుర్తుచేస్తున్నాయి.

వెబ్ లో అందుబాటులో ఉన్న‌ తాజా వీడియోల ప్రకారం.. కేవలం కొద్దిమంది వ్యక్తులు మాత్రమే కాకుండా, చిన్న పిల్లలు, మహిళలతో కూడిన వందలాది సంపూర్ణ కుటుంబాలు రాత్రంతా బీచ్‌ ఇసుకపైనే గడుపుతున్నాయి. పగటిపూట సూర్యుడి భ‌గ‌భ‌గ‌ల‌కు తోడు.. రాత్రి వేళల్లో కూడా ఉక్కపోత ఏమాత్రం తగ్గకపోవడంతో ఇళ్ల‌లో ఉండటం వారికి నరకప్రాయంగా మారింది.

ఇలాంటి ఘటనే ముంబై పరిసర ప్రాంతమైన మీరా భ‌యంద‌ర్ లో కూడా వెలుగుచూసింది. భయందర్ ఈస్ట్‌లోని ఆనంద్ దిఘే మైదానంలో వందలాది మంది వలస కార్మికులు రాత్రి వేళల్లో బహిరంగంగా నిద్రించ‌డం క‌నిపించింది. వీరంతా సమీపంలోని ఇందిరా నగర్ ప్రాంతానికి చెందిన నివాసితులు. రేకుల షెడ్లలో నివసించే వీరికి పగటి వేడి వల్ల రాత్రి పూట కూడా ఆ ఇళ్లు నిప్పుల కొలిమిలా మారుతుండటంతో... గాలి ఆడక ప్రాణాలు కాపాడుకోవడానికి మైదానాన్ని ఆశ్రయించక తప్పడం లేదని వారు వాపోతున్నారు. ఇంటికి కనీస వెంటిలేషన్ లేకపోవడం, విద్యుత్ ఛార్జీల భయం లేదా ఏసీలు కొనే ఆర్థిక స్తోమత లేకపోవడం వీరిని ఈ నిర్ణయం వైపు నెట్టాయి.

మైదానంలో వందలాది మంది ప్రజలు నిద్రిస్తుండటాన్ని గమనించిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) నగర అధ్యక్షుడు సందీప్ రాణే నాయకత్వంలోని ప్రతినిధి బృందం అక్కడ తనిఖీలు నిర్వహించింది. స్థానికులతో మాట్లాడి వారి సాధకబాధకాలను తెలుసుకున్న అనంతరం... ఆయన స్థానిక పోలీసులకు ఒక లేఖ సమర్పించారు. ఇంత పెద్ద సంఖ్యలో జనం బహిరంగ ప్రదేశాల్లో నిద్రిస్తున్నప్పుడు... వారి మధ్యలో ఎలాంటి అసాంఘిక శక్తులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఆశ్రయం పొందకుండా ఉండేందుకు... సాధారణ పౌరుల భద్రత కోసం పోలీస్‌ వెరిఫికేషన్ అవసరమని వారు అభిప్రాయపడ్డారు. వాతావరణ తాకిడికి తోడు భద్రతా పరమైన సమస్యలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.

భయందర్ మైదానం - వెర్సోవా బీచ్ దృశ్యాలు ముంబై లాంటి మెట్రో నగరాల్లోని అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలలో నివసించే సామాన్యుల దీన స్థితికి అద్దం పడుతున్నాయి. భరించలేని వేడి, ఉక్కపోత ఒక కారణమైతే... నగరంలోని పేద, మధ్యతరగతి ప్రజల గృహ వసతులు, ఇరుకైన గదులు ఎంత దయనీయంగా ఉన్నాయో ఈ సంఘటనలు సామాజికంగా పెద్ద చర్చకు దారితీశాయి. ప్రకృతి వైపరీత్యాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మునుముందు రోజుల్లో సిటీ ప్లానింగ్.. పేదల నివాస గృహాల నిర్మాణం మెరుగుపడకపోతే... సామాన్యుడికి ప్రతి వేసవి కాలం ఒక పెద్ద శాపంగానే మిగిలిపోనుంది. మూడు నాలుగు నెల‌ల పాటు ఎలాంటి ర‌క్ష‌ణా లేని చోట పిల్ల‌లు, ఆడ‌వారితో కుటుంబాలు ఆరుబ‌య‌ట నిదుర‌పోవాల్సి వ‌స్తుంది అంటే అది ప్ర‌భుత్వాల ఘోర వైఫ‌ల్యంగా చూడాలి.

ఇది ఎల్.నినో ప్ర‌భావ‌మా?

ప్రస్తుతం ప్ర‌పంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఎల్.నినో ప్రభావం వల్లే ఈ విధమైన దుస్థితి ఏర్పడిందనే నిజాన్ని ప్ర‌జ‌లు నెమ్మ‌దిగా గ్ర‌హిస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి భారత్ మున్ముందు అతివృష్టి లేదా అనావృష్టి వంటి తీవ్ర సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందా అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.