Begin typing your search above and press return to search.

55% కే ఇంత సెలబ్రేషన్?.. ఫ్యామిలీ సర్‌ప్రైజ్ వైరల్!

ఇక తక్కువ మార్కులు వచ్చినప్పుడు పిల్లలను గుండెకు హత్తుకుని సెలబ్రేట్ చేసుకున్న సంఘటనలు గతంలోనూ జరిగాయి.

By:  Madhu Reddy   |   16 May 2026 3:25 PM IST
55% కే ఇంత సెలబ్రేషన్?.. ఫ్యామిలీ సర్‌ప్రైజ్ వైరల్!
X

మనం పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే చాలు.. ఇంట్లో పేరెంట్స్ ఇచ్చే క్లాసులు, పక్కింటి పిల్లలతో పోలికలు మామూలుగా ఉండవు. కానీ, ముంబైకి చెందిన ఒక ఫ్యామిలీ మాత్రం తమ అబ్బాయికి 55% మార్కులు వస్తే తిట్టాల్సింది పోయి, ఏకంగా గ్రాండ్‌గా సర్‌ప్రైజ్ పార్టీ ఇచ్చి కేక్ కట్ చేయించారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ పాజిటివ్ వీడియో, భారతీయ తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో రావాల్సిన మార్పులపై సరికొత్త చర్చకు దారితీసింది. ఆ మనసుకు హత్తుకునే విశేషాలు చూద్దాం..

మార్క్‌షీట్ కేక్‌తో అదిరిపోయే సర్‌ప్రైజ్:

ముంబైలో జరిగిన ఈ ఘటన పాతకాలపు పేరెంటింగ్ పద్ధతులకు చరమగీతం పాడింది. పరీక్షల్లో 500 మార్కులకు గానూ 276 మార్కులు (55 శాతం) తెచ్చుకున్న కొడుకును ఆ కుటుంబం ఎంతో ఉత్సాహంగా ఇంట్లోకి ఆహ్వానించింది. అంతటితో ఆగకుండా, కుమారుడి మార్కులతో కూడిన ఒక స్పెషల్ 'మార్క్‌షీట్ థీమ్ కేక్' తయారు చేయించి మరీ కట్ చేయించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు “ఇదే నిజమైన పేరెంటింగ్” అంటూ ప్రశంసలు వెల్లువెత్తిస్తున్నారు.

ఇక తక్కువ మార్కులు వచ్చినప్పుడు పిల్లలను గుండెకు హత్తుకుని సెలబ్రేట్ చేసుకున్న సంఘటనలు గతంలోనూ జరిగాయి.

మధ్యప్రదేశ్ తండ్రి నిర్ణయం:

కొన్నేళ్ల క్రితం మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక తండ్రి, తన కొడుకు 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు ఏకంగా ఊరంతటికీ స్వీట్లు పంచి, బాణసంచా కాల్చి పండగ చేసుకున్నాడు. 'నా కొడుకు కేవలం ఒక పరీక్షలో ఫెయిల్ అయ్యాడు, జీవితంలో కాదు. ఇక వాడికి ధైర్యం చెప్పడానికే ఈ వేడుక చేశా' అని ఆ తండ్రి చెప్పిన మాటలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

ఐఏఎస్ అధికారి పోస్ట్ వైరల్ :

ఒక ప్రముఖ ఐఏఎస్ అధికారి తన 10వ తరగతి మార్కుల లిస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఆయనకు కెమిస్ట్రీలో కేవలం పాస్ మార్కులే (35 మార్కులు) వచ్చాయి. ఇక తక్కువ మార్కులు వచ్చినా జీవితంలో పట్టుదల ఉంటే ఐఏఎస్ లాంటి అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని, మార్కులు మాత్రమే జీవితాన్ని శాసించలేవని ఆయన నిరూపించారు.

తల్లిదండ్రుల ఆలోచన మారాలి:

ప్రస్తుత పోటీ ప్రపంచంలో పేరెంట్స్ కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ర్యాంకులు, మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి పెంచడం వల్ల వారు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారు.ఇక 90 శాతం మార్కులు వచ్చినా సంతృప్తి చెందని తల్లిదండ్రులు ఉన్న ఈ రోజుల్లో.. 55 శాతం వచ్చినా కొడుకు కష్టాన్ని గుర్తించి గౌరవించిన ఈ ముంబై ఫ్యామిలీ ప్రతి ఒక్కరికీ ఒక రోల్ మోడల్.

పిల్లల్లో పెరగాల్సిన ఆత్మవిశ్వాసం:

మార్కులు తక్కువ వచ్చినప్పుడు పిల్లలను తిట్టడం వల్ల వారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఇక అదే సమయంలో కుటుంబం నుండి ఇలాంటి ప్రేమ సపోర్ట్ దక్కితే వారిలో భవిష్యత్తుపై కొత్త ఆశ చిగురిస్తుంది. 'ఈసారి తక్కువ వస్తే ఏంటి.. వచ్చేసారి ఇంకా బాగా కష్టపడతాను' అనే నమ్మకం వారిలో ఏర్పడుతుంది. పుస్తకాల్లో ఉండే పర్సంటేజ్ కంటే, కుటుంబం ఇచ్చే ధైర్యమే పిల్లలను జీవితంలో గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది.

మార్కుల కంటే పిల్లల ప్రాణాలు, వారి సంతోషమే ముఖ్యం. జీవితం అనేది కేవలం ఒక ప్రపోర్షనల్ మార్క్‌షీట్ కాదు, అదొక సుదీర్ఘమైన ప్రయాణం. ఇక ప్రతి బిడ్డలోనూ ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది, దాన్ని గుర్తించి ప్రోత్సహించడమే తల్లిదండ్రులు ఇచ్చే అసలైన ఆస్తి. ఈ ముంబై ఫ్యామిలీ లాగే ప్రతి ఇంట్లోనూ పిల్లల ప్రయత్నాన్ని ప్రేమిస్తే.. రేపటి తరం మరింత ఆరోగ్యకరమైన మనస్తత్వంతో ఎదుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం వుండదు.