బ్యాంకులలో వాటాలు అమ్మకానికి మోడీ సర్కార్ రెడీ ?
కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలోని బ్యాంకులలో వాటాలను విక్రయించాలని కీలక నిర్ణయం తీసుకుంది.
By: Satya P | 19 Jun 2026 2:00 PM ISTకేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలోని బ్యాంకులలో వాటాలను విక్రయించాలని కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం బ్యాంకులనే కాదు ప్రభుత్వ రంగ సంస్థలలో తన పెట్టుబడులు ఉప సంహరించుకోవడంతో పాటు పూర్తిగా పక్కకు తప్పుకోవాలని కూడా యాక్షన్ ప్లాన్ ఉంది. ఈ ఏడాది అంటే 2026-27 ఆర్ధిక సంవత్సరం చూస్తే కనుక ఈ విధంగా పెద్ద ఎత్తున వాటాల విక్రయం పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ద్వారా ఏకంగా 80 వేల కోట్ల రూపాయలను ఖజానాకి సమీకరించాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది అని అంటున్నారు.
ఆ మూడు బ్యాంకులకూ :
ఈ క్రమంలో మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటాలను విక్రయించాలని మోడీ సర్కార్ దూకుడుగా అడుగులు వేస్తోంది అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చూస్తే కనుక అయిదు ప్రభుత్వ రంగ సంస్థలలో ఓ ఎఫ్ ఎస్ రూపంలో వాటాలని విక్రయించి కేంద్ర ప్రభుత్వం 16 వేల కోట్ల రూపాయల వరకూ నిధులను సమీకరించింది అని చెబుతున్నారు. ఇక ఈ మూడు బ్యాంకులను కూడా ఓఎఫ్ ఎస్ కోసం రంగం సిద్ధం చేస్తోంది అని అంటున్నారు. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంకులలో కేంద్ర ప్రభుత్వ వాటాలను విక్రయించేందుకు కార్యాచరణను కేంద్రం రూపొందిస్తోంది. ఈ మూడు బ్యాంకులలో కలిపి ఎనిమిది నుంచి పది శాతం వరకూ వాటాలను అమ్మడం ద్వారా 13 వేల కోట్ల రూపాయల ద్వారా ప్రభుత్వం ఖజానాకు ఆదాయం సమకూర్చుకోనుంది అని అంటున్నారు.
సెబీ నిబంధనకు అనుగుణంగా :
ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాల విక్రయం అన్నది మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా సెబీ కనీసమైన పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలకు అనుగుణంగానే ఉంటుందని చెబుతున్నారు. సెబీ నిబంధలను ఏమి చెబుతాయంటే స్టాక్ ఎక్సేంజిలో లిస్ట్ అయిన కంపెనీలలో పబ్లిక్ షేర్ హోల్డింగ్ కనీసం ఇరవై అయిదు శాతం ఉండాలని. ఇక్కడ ప్రమోటర్లు కాకుండా విదేశీ పెట్టుబడిదారులు దేశీయ పెట్టుబడిదారులు, సాధారణ పెట్టుబడిదారుల వాటా కనీసం 25 శాతంగా ఉండాలని సెబీ చెబుతోంది.
అన్నీ చూసుకుంటూనే :
అయితే కేంద్రం విక్రయించబోతున్న ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకులలో కూదా కేంద్ర ప్రభుత్వ వాటా ఏకంగా 93 శాతం పై దాటే ఉంది. దాంతో సెబీ రూల్స్ రూల్స్ ని అనుసరిస్తూనే ఒకేసారి వాటాల విక్రయం కాకుండా విడతల వారీగా చేపట్టడం ద్వారా భారీగానే ఆదాయం అందుకోవాలని కేంద్రం చూస్తోంది అని అంటున్నారు.
వరస బెట్టి లైన్ లో :
అంతే కాదు 2026-27 ఆర్ధిక సంవత్సరంలో వరసబెట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టడం అలగే ఆస్తుల నగదీకరణ, అలాగే వివిధ వాటాల విక్రయం ద్వారా నిధులు సమకూర్చుకోవడం ఇలా కంద్రం ప్రణాళికా బద్ధంగానే ముందుకు సాగాలని చూస్తోంది. వీటి ద్వారా 80 వేల కోట్ల దాకా ఆదాయం కేంద్ర ఖజానాకు చేరుతుందని అంటున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కూడా ప్రకటన చేసింది. మొత్తం మీద చూస్తే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తప్పుకోవాలని మోడీ ప్రభుత్వం దూకుడుగా వేస్తున్న అడుగులు చర్చనీయాంశం అవుతున్నాయి.
