Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రి పదవి ఏపీలో ఆయనకేనా ?

కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. అతి తొందరలోనే ఈ ప్రక్రియ జరగనుంది.

By:  Satya P   |   27 Aug 2026 6:15 AM IST
కేంద్ర మంత్రి పదవి ఏపీలో ఆయనకేనా ?
X

కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. అతి తొందరలోనే ఈ ప్రక్రియ జరగనుంది. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ గురించి గతంలో బీజేపీ పెద్దలు ఏమి అనుకున్నా కూడా ఇపుడు మాత్రం కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. గతంలో అయితే అనుభవం ఇతరత్రా పరిగణనలోకి తీసుకునేవారు. ఇపుడు యూత్ తో కనెక్ట్ అయ్యే వారికి చాన్స్ తప్పకుండా వస్తుందని అంటున్నారు. అలాగే మిడిల్ ఏజ్ వారికి యూత్ కి ఎక్కువగా అవకాశాలు దక్కుతాయని అంటున్నారు. ఇక మోడీ కేబినెట్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఈసారి మరింతగా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది అని అంటున్నారు. ఉన్న వారిని కొనసాగిస్తూ కొత్తగా మరికొందరికి అవకాశం ఇస్తారని అంటున్నారు.

ఏపీలో ఒకరికి కచ్చితంగా :

ఇక ఏపీలో ప్రస్తుతం ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నారు. అందులో ఒకరు కేబినెట్ ర్యాంక్ అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడు అయితే మరో ఇద్దరు సహాయ మంత్రులుగా ఉన్నారు. టీడీపీకి చెందిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ వీరిలో ఒకరు అయితే రెండవవారు నరసాపురం ఎంపీ బీజేపీకి చెందిన శ్రీనివాస వర్మ. ఇక వీరిని విస్తరణ తరువాత కూడా కొనసాగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పెమ్మసానికి అయితే ఇండిపెండెంట్ చార్జితో ప్రమోషన్ దక్కనుంది అని అంటున్నారు. ముగ్గురు మంత్రుల శాఖలు మారవచ్చు అని అంటున్నారు. వీరితో పాటు మరో మంత్రిని కేంద్రంలో తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఏపీలో టీడీపీ బీజేపీకి కేంద్ర మంత్రివర్గంలో చోటు ఉంది. లేనిది జనసేనకే అందుకే ఆ పార్టీకి ఈసారి చాన్స్ ఇస్తారని అంటున్నారు. జనసేనకు లోక్ సభలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అలాగే రాజ్యసభలో కొత్తగా ఒకరు ఇటీవలనే నెగ్గారు.

ఆయనకే అవకాశం :

ఇక జనసేన నుంచి చూస్తే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ ఉన్నారు. రాజ్యసభ ఎంపీగా లింగమనేని రమేష్ ఉన్నారు. వీరి ముగ్గురులో బాలశౌరి సీనియర్ గా ఉన్నారు. ఆయన ఇప్పటికి మూడు సార్లు ఎంపీగా పనిచేశారు. పార్లమెంటరీ వ్యవహారాలపైన అనుభవం ఉంది. అన్ని విధాలుగా అవగాహన ఉంది. దాంతో ఆయన పేరునే జనసేన నుంచి తీసుకుంటారు అని అంటున్నారు. సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు బాలశౌరి జనసేనలో చేరారు, ఆ తరువాత కూటమి ప్రభంజనంలో ఆయన గెలిచారు. ఇపుడు ఆయనకు కేంద్ర మంత్రిగా కూడా అవకాశం లభించడం ఖాయమని అని అంటున్నారు. రాజకీయ సామాజిక ప్రాంతీయ సమీకరణలు కూడా సరిపోతాయని అంటున్నారు. సో ఆయన పేరు అయితే గట్టిగా ఏపీ నుంచి వినిపిస్తోంది.

తెలంగాణాలో ఇద్దరు :

అదే విధంగా తెలంగాణా నుంచి చూస్తే ఇద్దరు పేర్లు ఖాయమని అంటున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న ఇద్దరికి మరో ఇద్దరు జత అవుతారు అన్న మాట. ఆ ఇద్దరే మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మల్కాజ్ గిరీ ఎంపీ ఈటెల రాజేందర్ అని అంటున్నారు. డీకే అరుణ కాంగ్రెస్ లో కూడా ఉమ్మడి ఏపీలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.మహిళా నేతగా ఆమె కీలకంగా ఉన్నారు. అలాగే బీసీ కోటాలో సీనియర్ నేత ఈటెల రాజేందర్ కి కేంద్ర మంత్రి అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. అలాగే సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే కేంద్ర కేబినెట్ విస్తరణ తరువాత ఏపీ నుంచి నలుగురు తెలంగాణా నుంచి నలుగురు కేంద్ర మంత్రులుగా ఉంటారు అని అంటున్నారు.