Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుపై 'టులీ' రాసిన క‌థ‌నం వైర‌ల్‌.. ఏంటిది?

నేటి త‌రానికి విలియం మార్క్ టులీ అంటే ఎవ‌రో పెద్ద‌గా తెలియ‌క పోవ‌చ్చు. ఈయ‌న ప్ర‌ఖ్యాత జ‌ర్న‌లిస్టు. ఇండియాలోనే పుట్టినా.. ఆయ‌న అంత‌ర్జాతీయ జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశారు.

By:  Garuda Media   |   26 Jan 2026 5:30 PM IST
చంద్ర‌బాబుపై టులీ రాసిన క‌థ‌నం వైర‌ల్‌.. ఏంటిది?
X

నేటి త‌రానికి విలియం మార్క్ టులీ అంటే ఎవ‌రో పెద్ద‌గా తెలియ‌క పోవ‌చ్చు. ఈయ‌న ప్ర‌ఖ్యాత జ‌ర్న‌లిస్టు. ఇండియాలోనే పుట్టినా.. ఆయ‌న అంత‌ర్జాతీయ జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశారు. అయితే.. భార‌త్‌తోనే ఎక్కువ‌గా సంబంధాలు పెంచుకున్నారు. సుమారు 70 ఏళ్ల‌పాటు.. ఆయ‌న జ‌ర్న‌లిజంలో అనేక ఉత్థాన ప‌త‌నాల‌ను చ‌విచూశారు. బీబీసీ వంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌లో బ్యూరో చీఫ్ గా ప‌నిచేశారు. అయితే.. తాజాగా ఆయ‌న 90 ఏళ్ల వ‌య‌సులో ఆదివారం క‌న్నుమూశారు.

ఇదిలావుంటే..మార్క్ టులీ.. గ‌తంలో ఉమ్మ‌డి ఏపీకి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబుపై రాసిన ఓ క‌థ‌నం ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇది ఫార్వార్డ్ అవుతోంది. దీనికి కార‌ణం.. అప్ప‌ట్లోనే చంద్ర‌బాబు దూర‌దృష్టి.. అభివృద్ధి, ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు అంటూ.. టులీ త‌న క‌థ‌నాల‌ను(అంత‌ర్జాతీయ మ్యాగ‌జైన్ల‌లో) రాశారు. అనేక విష‌యాల‌ను ఆయ‌న విశ్లేషించారు. ఇప్పుడు ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత‌.. మ‌రోసారి అవి వెలుగు చూస్తున్నాయి.

ప్ర‌ధానంగా సీఎం చంద్ర‌బాబు వ్య‌క్తిత్వాన్ని గురించి టులీ ప్ర‌స్తావిస్తూ.. ''ఆయ‌న ఎంజాయ్ చేయ‌డం.. నేను ఎప్పుడూ చూడలేదు. ఆయ‌న ఎక్క‌డున్నా.. ఏం చేస్తున్నా.. రాష్ట్ర అభివృద్ధి కోస‌మే ప్ర‌య‌త్నించారు. ప్ర‌జ‌ల కోస‌మే క‌ల‌లు క‌న్నారు. ముఖ్యంగా టెక్నాల‌జీ, త‌దుప‌రి త‌రం(నెక్ట్స్ జ‌న‌రేష‌న్‌) కోసం ఆయ‌న ఎంతో శ్ర‌మిస్తున్నారు'' అని అని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను టెక్నాలజీ కేంద్రంగా మార్చేందుకు ఉ చంద్రబాబు చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా రికార్డు చేశారు.

ఈ-గ‌వ‌ర్నెన్స్‌కు చంద్ర‌బాబు ఆద్యుడంటూ.. టులీ 30 ఏళ్ల కింద‌టే రాయ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. త‌న జీవితంలో ఒక రోజు రోజంతా.. చంద్రబాబుతోనే తిరిగిన విష‌యాల‌ను కూడా ఆయ‌న త‌న వ్యాసాల్లో పంచుకున్నారు. ‘ఇండియా ఇన్‌ స్లో మోషన్‌’ అనే పుస్తకంలో ‘సైబరాబాద్‌ సృష్టి’పై ప్రత్యేక అధ్యాయాన్ని కూడా టులీ పేర్కొన్నారు. బిజినెస్ ఎకో సిస్ట‌మ్‌ ఏర్పరిచేందుకు చంద్రబాబు చేసిన కృషిని తొలిసారి టులీనే వెలుగులోకి తీసుకువ‌చ్చారు. ఇలా.. ఆయ‌న అప్ప‌ట్లో రాసిన వ్యాసాలు.. ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.