కంత్రీ మొగుడు: 80 వేలు ఖర్చుచేసి.. భార్యను 'ప్రేమ'గా చంపేశాడు!
భార్య-భర్తల బంధానికి కొందరు చేస్తున్న పనులు అర్ధాన్ని మార్చేస్తున్నాయి. భార్యను భర్త చంపేయడం.. భర్తను భార్య లేపేయ డం ఇటీవల కాలంలో తరచుగా జరుగుతున్నాయి.
By: Garuda Media | 6 May 2026 7:00 AM ISTభార్య-భర్తల బంధానికి కొందరు చేస్తున్న పనులు అర్ధాన్ని మార్చేస్తున్నాయి. భార్యను భర్త చంపేయడం.. భర్తను భార్య లేపేయ డం ఇటీవల కాలంలో తరచుగా జరుగుతున్నాయి. ఏపీలో ఈ తరహా నేరాలు మరింతగా పెరుగుతున్నాయి. తాజాగా ఓ కంత్రీ మొగుడు చేసిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. యూట్యూబ్ చూసి భార్యను ఎలా చంపాలో నేర్చుకున్నాడు. అంతేకాదు.. ఈ క్రమంలో 80 వేల రూపాయలు ఖర్చు పెట్టి.. ఓ విష పదార్ధాన్ని ఆన్లైన్లో కొనుగోలు చేసి హైదరాబాద్ నుంచి కొరియర్లో తెప్పించుకున్నాడు. ఆతర్వాత కట్టుకున్న భార్యను `ప్రేమ`గా చంపేశాడు!.
ఏం జరిగింది?
కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతంలో భార్యాభర్తలు పద్మజ, కిరణ్కుమార్ నివసిస్తున్నారు. వీరికి చాలా కాలం కిందటే వివాహం అయింది. అయితే.. కొన్నాళ్లుగా భార్య లావెక్కి పోతుండడంతో కిరణ్ కుమార్ ఆమెతో చనువుగా ఉండడం తగ్గించాడు. ఇది ఇరువురి మధ్య అనుమానాలకు దారి తీసింది. తరచుగా పద్మజ.. ఈ విషయంపైనే కిరణ్తో గొడవపడడం ప్రారంభించింది. ``నేను లావుగా ఉన్నాననే కదా.. నాకు దూరంగా ఉంటున్నావు`` అంటూ ఆమె నిలదీయడం ప్రారంభించింది.
ఈ వ్యవహారంతో విసిగిపోయాడో ఏమో.. ఏకంగా పద్మజను అంతమొందించాలని కంత్రీ ప్లాన్ చేశాడు కిరణ్. ఈ క్రమంలో భార్యను చంపడం ఎలా? అంటూ.. తన సెల్ ఫోన్లోని యూట్యూబ్లో తెగవెదికేశాడు. యూట్యూబ్ సమాచారం ఆధారంగా.. ఓ విష పదార్థాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించాడు. హైదరాబాద్లోని ఓ ప్రాంతంలో లభిస్తుందని తెలుసుకుని.. వారితో ఫోన్లో ముచ్చటించి.. కొరియర్ ద్వారా విష పదార్థాన్ని తెప్పించుకున్నాడు. దీనికిగాను ఏకంగా 80 వేల రూపాయలను ఆయన ఖర్చుచేశాడు.
విషయం అయితే ఇంటికి వచ్చేసింది.. చంపడం ఎలానో కూడా తెలిసిపోయింది. కానీ, ఇక్కడే సందర్భం దొరకలేదు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లు వేచి చూసిన కిరణ్ కుమార్.. గత నెల 29న ఓ సందర్భాన్ని తనే సృష్టించి.. ఇంటికి పాలకోవాలు తీసుకువచ్చాడు. తన భార్యకు ప్రేమతో తినిపించే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ పాలకోవాలో విషం కలిపాడని.. అది తింటే తన ప్రాణం పోతుందని తెలియని పద్మజ.. చాలా కాలం తర్వాత.. భర్త `దగ్గర` అయ్యే సరికి.. ఆయన పాలకోవా ఇచ్చే సరికి..ఐసైపోయి.. దానిని తినేసింది.
ఇంకేముంది.. తిన్న అరగంటలో ప్రాణం పోయింది. అయినప్పటికీ కిరణ్లో ఎక్కడో అనుమానం మొలకెత్తింది. ఇంత పెద్ద శరీరం.. ఇంత చిన్న విషయానికి పోతుందా? అని అనుకుని.. మరోసారి చనిపోయిందో లేదో చూసుకుందామని దిండుతో ఆమె ముఖంపై అదిమిపెట్టి.. కొద్ది సేపు అలానే కూర్చున్నాడు. అనంతరం.. ఆమె చనిపోయిందని నిర్ధారించుకుని.. ఏమీ తెలియని వాడిలా..ఇరుగు పొరుగు వారిని పిలిచి.. ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఇక్కడే కిరణ్ అడ్డంగా దొరికిపోయాడు. వైద్యులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాన్ని కక్కించారు. కంత్రీ మొగుడిని.. జైలుకు తరలించారు.
