వైసీపీలో 'విష్ణు' చక్రం తిరగడం లేదు.. వదిలేశారు.. !
మల్లాది విష్ణువర్ధన్. వైసీపీ నాయకుడు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. ఒకప్పుడు ఆయన హవా ఎక్కువగా ఉండేది.
By: Garuda Media | 22 May 2026 7:00 AM ISTమల్లాది విష్ణువర్ధన్. వైసీపీ నాయకుడు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. ఒకప్పుడు ఆయన హవా ఎక్కువగా ఉండేది. ఏ పార్టీలో ఉన్నా.. ఏ రాజకీయం చేసినా.. నియోజకవర్గంలో పర్యటించే వారు. గెలిచినా.. ఓడినా నేను మీవాడినే అనే వారు. స్థానిక సమస్యలను కూడా పట్టించుకునే వారు. ప్రజల కు మేలు చేసేందుకు తన వంతు సహకారం అందించేవారు. అయితే.. తాజాగా పరిస్థితిమారిపోయింది. ఆయన ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. కేవలం టీవీ డిబేట్లలో మాత్రమే కనిపిస్తున్నారు.
దీంతో నియోజకవర్గంలో విష్ణు ప్రభావం ఎంత అనే విషయంపై తాజాగా ఆన్లైన్ సంస్థ ఒకటి సర్వే చేసింది. వాస్తవానికి టీడీపీ ఎమ్మెల్యే పనితీరును తెలుసుకునేందుకు వచ్చిన సంస్థ.. పనిలో పనిగా.. వైసీపీ నాయకుడు విష్ణు విషయాన్ని కూడా ఆరా తీసింది. ``మల్లాది విష్ణు ఎవరో తెలుసా?`` అన్న ప్రశ్నకు ప్రజల నుంచి ఆసక్తికర సమాధానం వచ్చింది. తెలుసని కొందరు చెప్పగా.. ఆయన మమ్మల్ని మరిచిపోయాడు.. మేం ఎందుకు ఆయన గురించి చెప్పాలని.. మాస్ జనాలు.. ఆసక్తిగా స్పందించారు.
ఈ పరిణామం.. నియోజకవర్గం వ్యాప్తంగా కనిపించింది. ఒకప్పుడు విష్ణును సమర్థించిన వ్యాపార వర్గాలు.. బ్రాహ్మణ వర్గాలు కూడా.. ఇప్పుడు విష్ణు గురించి పెదవి విరుస్తున్నాయి. దీనికి కారణం.. ఆయన ప్రజల మధ్య ఉండకపోవడం.. ప్రజలను పట్టించుకోక పోవడమే. గత ఎన్నికల్లో విష్ణుకు టికెట్ రాలేదు. దీంతో ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఇక, టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు వచ్చాక క్షేత్రస్థాయిలో పర్యటనలు కూడా మానేశారు.
తన వ్యాపారం విషయంలో ఆయన కొందరు టీడీపీ నాయకులతో మిలాఖత్ అయ్యారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ కారణంగానే నియోజకవర్గంలో యాక్టివిటీస్ తగ్గించారన్న చర్చ ఉంది. అయితే.. మరో వాదన కూడా దీనికి తోడైంది. తనకు పార్టీ బాధ్యతలు అప్పగించలేదని.. నియోజకవర్గంలో బాధ్యతలు ఇస్తే.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇస్తే.. అప్పుడు యాక్టివ్ అవుతామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నారు. సో.. మొత్తంగా గత ఎన్నికల్లో జరిగిన పరాభవం నుంచి విష్ణు ఇంకా బయట పడలేదన్నది స్పష్టం అవుతోంది.
