పవన్ సర్.. ఇటో లుక్కేయండి ప్లీజ్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటో లుక్కేయాలంటూ.. దేవదాయ శాఖ అధికారులు కోరుతున్నారు.
By: Garuda Media | 13 Feb 2026 5:58 PM ISTఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటో లుక్కేయాలంటూ.. దేవదాయ శాఖ అధికారులు కోరుతున్నారు. ప్రస్తుత ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్.. అటవీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అటవీ శాఖ అధికారులకు.. దేవదాయశాఖ అధికారులకు మధ్య ఓ వివాదం తలెత్తింది. ఈ సమస్యను పరిష్కరించకపోతే.. ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుని సదరు సమస్యను పరిష్కరించాలని దేవదాయ శాఖ అధికారులు కోరుతున్నారు.
విషయం ఏంటంటే..
ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో .. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లోనే మహాశివరాత్రి వేడుకలు కూడా జరగనున్నాయి. శ్రీశైలం దేవస్థానానికి చేరుకునేం దుకు భక్తులకు అనేక మార్గాలు ఉన్నాయి. అయితే.. ఆదినుంచి వస్తున్న ఆచారంలో భాగంగా ఇప్పటికీ కొన్ని వేల మంది భక్తులు.. నడక మార్గంలో శ్రీశైలానికి చేరుకుంటున్నారు. ఇలా నడక మార్గంలో వచ్చేవారు.. నల్లమల అడవిలో 46 కిలో మీటర్ల మేరకు నడవాలి.
ఈ నేపథ్యంలో అటవీ మార్గంలో నడిచే భక్తులకు ఆ శాఖ అధికారులే భద్రత కల్పించాలి. అలాగే.. భక్తుల కు అవసరమైన భోజనం, నీరు. టీ వంటివాటిని కూడా ఏర్పాటు చేయాలి. ఈ ఏడాది మాత్రం అటవీ శాఖ అధికారులు రివర్స్ అయ్యారని దేవదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం.. ఆయా ఏర్పాట్లు చేసేందుకు అటవీ శాఖకు నంద్యాల జిల్లా అధికారులు 5-6 లక్షలవరకు చెల్లిస్తున్నారు. కానీ, ఈఏడాది మాత్రం 60 లక్షల రూపాయలు చెల్లించాలని అటవీ అధికారులు పట్టుబట్టారు. దీంతో ఇరు శాఖల మధ్య వివాదం ముదిరింది.
మరోవైపు రెండు రోజుల్లోనే మహా శివరాత్రి వేడుక రానుంది. దీంతో అటవీ మార్గంలో వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. అటవీ శాఖ అధికారుల సహకారం లేకపోవడంతో భక్తులకు సరైన భద్రత, రక్షణ కల్పించలేక పోతున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. లేకపోతే.. భక్తులకు ఏదైనా జరిగితే.. అది సర్కారు మొత్తానికీ చెడ్డ పేరు తెస్తుందని హెచ్చరిస్తున్నారు.
