Begin typing your search above and press return to search.

యుద్ధం మధ్యలోంచి ఎల్పీజీ తీసుకొచ్చింది.. అదీ భారత్ అంటే?

ఈ భారీ గ్యాస్ సరఫరా దేశానికి చేరుకోవడంతో ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న గ్యాస్ కొరత పరిస్థితి కొంతవరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By:  A.N.Kumar   |   16 March 2026 11:28 AM IST
యుద్ధం మధ్యలోంచి ఎల్పీజీ తీసుకొచ్చింది.. అదీ భారత్ అంటే?
X

దేశంలో ఇటీవల పెరుగుతున్న గ్యాస్ కొరత నేపథ్యంలో భారత్‌కు ఒక పెద్ద ఊరటనిచ్చే పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొంటూ హార్ముజ్ జలసంధిని దాటుకున్న ఎల్.పీజీ సరకు నౌక ‘శివాలిక్’ త్వరలోనే గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకోనుంది. ఈ నౌకలో దాదాపు 40 నుంచి 46 వేల మెట్రిక్ టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్.పీజీ) ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ భారీ గ్యాస్ సరఫరా దేశానికి చేరుకోవడంతో ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న గ్యాస్ కొరత పరిస్థితి కొంతవరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇటీవల అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో పశ్చిమాసియా ప్రాంతంలో సముద్ర మార్గాలపై అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద భద్రతా పరిస్థితులు కాస్త ఆందోళనకరంగా మారాయి. అయినప్పటికీ భారతదేశానికి అత్యవసరంగా అవసరమైన ఎల్.పీజీ సరఫరా నిలిచిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం , ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. ఈ క్రమంలోనే ‘శివాలిక్’ నౌక ఎలాంటి ఇబ్బందులు లేకుండా జలసంధిని దాటి భారత తీరాలకు చేరువవుతోంది.

ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ‘నందా దేవి’ అనే మరో ఎల్.పీజీ సరకు నౌక కూడా త్వరలోనే భారత్‌కు చేరుకోనుంది. ఈ నౌకలో కూడా సుమారు 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్.పీజీ సరుకు ఉందని సమాచారం. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నౌకకు భారత నౌకాదళం ప్రత్యేక భద్రతా ఎస్కార్ట్ కల్పిస్తోంది. సముద్ర మార్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నేవీ పర్యవేక్షణలోనే ఈ నౌక భారత తీరాలకు చేరుకుంటోంది.

ఈ రెండు నౌకలు భారత్‌కు చేరుకోవడం ద్వారా గ్యాస్ నిల్వలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గృహ వినియోగానికి అవసరమైన ఎల్.పీజీ సిలిండర్ల సరఫరా వ్యవస్థపై ఇది సానుకూల ప్రభావం చూపనుంది. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో సిలిండర్ సరఫరాలో ఆలస్యం, డిమాండ్ పెరుగుదల వంటి సమస్యలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ భారీ సరఫరా పరిస్థితిని కొంతవరకు సర్దుబాటు చేయనుంది.

ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్లలో గ్యాస్ సరఫరా పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోంది. అవసరమైన చోట అదనపు దిగుమతులు చేయడం, వ్యూహాత్మక నిల్వలను పెంచడం వంటి చర్యల ద్వారా దేశంలో గ్యాస్ కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. తాజా పరిస్థితుల్లో ‘శివాలిక్’, ‘నందా దేవి’ నౌకల రాక భారత్‌కు ఒక పెద్ద ఊరటగా మారిందని అధికారులు చెబుతున్నారు.

మొత్తానికి ఈ భారీ ఎల్.పీజీ సరఫరా దేశంలో గ్యాస్ నిల్వలను బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులకు కూడా కొంత ఉపశమనం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిస్థితులు సద్దుమణిగితే త్వరలోనే గ్యాస్ సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.