కాంగ్రెస్ తూచ్.. మా ప్రత్యర్థి బీజేపీనే: కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
తెలంగాణ కాంగ్రెస్లో నాయకుల మధ్య కొట్లాట తీవ్రంగా సాగుతోందని కేటీఆర్ ఆరోపించారు. దీనికి ఉదాహరణ.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణేనని చెప్పారు.
By: Garuda Media | 13 Jun 2026 8:45 AM ISTతెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు కాంగ్రెస్ పార్టీ పోటీనే కాదన్నారు. తమ పోటీ అంతా.. బీజేపీతోనేనని తేల్చి చెప్పారు. ``కాంగ్రెస్ తూచ్. ఆ పార్టీతో పోటీనా.. మాకు ఆ పార్టీ పోటీనే కాదు. మా ప్రత్యర్థి బీజేపీనే. బీజేపీతోనే కొట్లాడుతాం. బీజేపీనే ఓడిస్తం. అధికారంలోకి వస్తం`` అని వ్యాఖ్యానించారు. అయితే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీపై ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగించిందని బీఆర్ ఎస్ నాయకులే గుసగుసలాడడం గమనార్హం.
ఒంటరి పోరే!
వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఈ విషయంలో మారు మాటలేదన్నారు. ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ప్రసక్తి ఉండదని తెలిపారు. ఎన్నికలకు ముందు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర చేస్తారని చెప్పారు. అయితే.. ఎప్పుడనేది ప్రస్తుతం ఆలోచనల దశలోనే ఉందన్నారు. ప్రభుత్వం పనితీరు ఏమీ బాగోలేదని.. ఇది తాను చెబుతున్న మాట కాదని అన్నారు. ప్రజలే చెబుతున్నారని.. రోజూ లెక్కలేనన్ని ఫోన్లు వస్తున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం చక్కగ ఉంటే.. ప్రజలు మాకెందు ఫోన్లు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఎక్కడికి వెళ్లినా.. ఈ ప్రభుత్వం అది చేయట్లేదు.. ఇది చేయట్లేదని చెబుతున్నారని.. ప్రభుత్వం బాగా పనిచేస్తే.. ప్రజలు ఇలా ఎందుకు ఉంటారని అన్నారు.
కాంగ్రెస్లో బ్లాక్ షీప్!
తెలంగాణ కాంగ్రెస్లో నాయకుల మధ్య కొట్లాట తీవ్రంగా సాగుతోందని కేటీఆర్ ఆరోపించారు. దీనికి ఉదాహరణ.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణేనని చెప్పారు. ``ఆమెపై కేసులు పెట్టారని.. కేసులు ఉన్నాయని.. ఎక్కడో మధ్యప్రదేశోళ్లకు ఎలా తెలుసు? ఇక్కడి వాళ్లు చెప్పారనే కదా తెలిసింది. ఈ విషయం నేను చెప్పడం లేదు. మహారాష్ట్ర మంత్రే చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులే తమకు సమాచారం ఇచ్చారని అన్నారు. దీనిని బట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ఆ నాయకుల పరిస్థితి ఎలా ఉందన్నది అర్ధం అవుతోంది. మరి బ్లాక్ షీప్లను అడ్డుకుంటరా.. పెంచుకుంటరా.. వారి ఇష్టం. ఇప్పటికైతే.. కాంగ్రెస్ పార్టీ జారుడు బండపై విన్యాసం చేస్తోంది. దానికి దిగుడే తప్ప. ఎక్కుడు లేదు.`` అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ను తాము చెడగొట్టలేదని కేటీఆర్ అన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ.. హైదరాబాద్ను డెవలప్ చేసిఉంటే.. ఇప్పుడు ఈపరిస్థితి వచ్చేదా? అని ప్రశ్నించారు. చుక్కనీరు పడినా.. కాలువలు కడుతున్నాయని.. తమ హయాంలో తీసుకు వచ్చిన నీటి నిర్వహణ విధానాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. వాటిని కొనసాగించి ఉంటే.. హైదరాబాద్ పరిస్థితి బాగుండేదన్నారు.
