వాహనదారులకు భారీ ఊరట కల్పించిన కేంద్రం.. ఇప్పట్లో పెంపు లేదని స్పష్టం..!
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ మైన్స్, రవాణా ఆటంకాలు ఉన్నప్పటికీ కేంద్రం ఇంత ధీమాగా ఉండేందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.
By: Tupaki Political Desk | 23 April 2026 3:25 PM ISTకోటక్ ఈక్విటీస్ వంటి సంస్థలు లీటరుకు ₹28 వరకు పెరగవచ్చని అంచనా వేసి సామాన్యుడిని భయాందోళనలకు గురిచేసిన వేళ, కేంద్ర పెట్రోలియం శాఖ పెద్ద ఊరటనిస్తోంది. ‘ధరలు పెంచే ప్రపోజల్ లేదు’ అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం మార్కెట్ ఊహాగానాలకు తెరదించినట్లయింది. కొన్ని రోజులుగా సోషల్ మీడియా, అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థల నివేదికల వల్ల సామాన్యుడు ‘ఎన్నికల తర్వాత పెట్రోల్ బాదుడు’ తప్పదని మానసికంగా సిద్ధమయ్యాడు. అయితే, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ చేసిన ట్వీట్ ఆందోళనలను పటాపంచలు చేసింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, భారత పౌరులపై ఆ భారాన్ని వేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని కేంద్రం తేల్చి చెప్పింది.
‘నాలుగేళ్లుగా పెంచని ఏకైక దేశం’
కేంద్ర ప్రభుత్వం తన అధికారిక ప్రకటనలో కొన్ని ఆసక్తికరమైన గణాంకాలను ముందుంచింది. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నా, భారత్ నాలుగేళ్లుగా రిటైల్ ధరలను సాధ్యమైనంత వరకు స్థిరంగా ఉంచగలిగింది. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా చమురు ధరలు 40-50 శాతం పెరిగినప్పుడు, భారత్ మాత్రం ప్రజల ప్రయోజనాలకే మొగ్గు చూపిందని ప్రభుత్వం పేర్కొంది. ముడి చమురు దిగుమతి బిల్లు పెరుగుతున్నా, ఎక్సైజ్ సుంకం సర్దుబాట్లు, చమురు కంపెనీలతో సమన్వయం ద్వారా సామాన్యుడిపై భారం పడకుండా చూస్తున్నామని తెలిపింది.
కోటక్ ఈక్విటీస్ అంచనాలపై స్పందన
బ్రోకరేజ్ సంస్థలు తమ లెక్కల ప్రకారం ₹28 పెంపు ఉండవచ్చని చెప్పినప్పటికీ, ప్రభుత్వం వాటిని కేవలం ‘అంచనాలు’గానే కొట్టిపారేసింది. చమురు కంపెనీల నష్టాల గురించి ప్రభుత్వం స్పందిస్తూ.. కంపెనీల లాభనష్టాల కంటే ప్రజల జీవన ప్రమాణాలు, ద్రవ్యోల్బణ నియంత్రణే తమకు ప్రాధాన్యత అని పరోక్షంగా సూచించింది. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ధరల పెంపు అనేది ప్రభుత్వానికి పెద్ద మైనస్ అవుతుంది. కాబట్టి, ప్రస్తుతానికి ధరల జోలికి వెళ్లకూడదని ఉన్నత స్థాయి నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.
హర్మూజ్ సంక్షోభం ఉన్నా ధీమా ఎందుకు?
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ మైన్స్, రవాణా ఆటంకాలు ఉన్నప్పటికీ కేంద్రం ఇంత ధీమాగా ఉండేందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. భారత్ వద్ద వ్యూహాత్మక చమురు నిల్వలు అత్యవసర పరిస్థితుల్లో కొన్ని వారాల పాటు దేశ అవసరాలను తీర్చగలవు. అంతర్జాతీయ ఆంక్షలు, పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య కూడా రష్యా నుంచి తక్కువ ధరకు చమురు దిగుమతి చేసుకోవడం భారత్కు పెద్ద ప్లస్ పాయింట్. దీనివల్ల మధ్యప్రాచ్యంపై ఆధారపడడం తగ్గింది.
సామాన్యుడికి కలిగే ప్రయోజనం
ఒకవేళ ప్రభుత్వం ధరలు పెంచి ఉంటే, అది గొలుసుకట్టు చర్యలా మారి అన్ని వస్తువుల ధరలను పెంచేసేది. పెట్రోల్ ధరలు పెరగకపోవడం వల్ల రవాణా ఖర్చులు పెరగవు, తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంటాయి. ఇప్పటికే ఇంటి అద్దెలు, స్కూల్ ఫీజులతో సతమతమవుతున్న మధ్యతరగతి ప్రజలకు ఈ వార్త పండగ లాంటిదే.
ప్రభుత్వం ప్రస్తుతం ‘ప్రపోజల్ లేదు’ అని చెప్పినప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులు మరింత దిగజారితే (ఉదాహరణకు హర్మూజ్ జలసంధి ఆరు నెలల పాటు మూతపడితే) భవిష్యత్తులో ధరల సర్దుబాటు తప్పకపోవచ్చు. అయితే, తక్షణమే పెంచే ఆలోచన లేదని చెప్పడం ద్వారా ప్రభుత్వం సామాన్యుడిలో భరోసా నింపింది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఇదే మొండితనాన్ని ప్రభుత్వం ప్రదర్శిస్తుందో లేదో వేచి చూడాలి
