Begin typing your search above and press return to search.

నెల రోజుల్లోనే మరో మరణం.. కోటా కుటుంబంలో తీరని విషాదం

ఆయన మరణం నుంచి కోలుకోకముందే ఆయన సతీమణి రుక్మిణి గారు కూడా లోకం వీడడం బాధాకరం. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, భర్త మరణం తర్వాత తీవ్రంగా కృంగిపోయారు.

By:  A.N.Kumar   |   18 Aug 2025 6:49 PM IST
నెల రోజుల్లోనే మరో మరణం.. కోటా కుటుంబంలో తీరని విషాదం
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మరణించిన నెల రోజుల్లోనే ఆయన సతీమణి కోటా రుక్మిణి కన్నుమూశారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. భర్త మరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న ఆమె, అనారోగ్య సమస్యలతో పోరాడుతూ తుదిశ్వాస విడవడం సినీ పరిశ్రమను, కోటా అభిమానులను మరోసారి విషాదంలో ముంచెత్తింది.

కోటా శ్రీనివాసరావు గారు జూలై 13న మూత్రపిండాల సమస్య, గుండె జబ్బుతో మరణించారు. ఆయన మరణం నుంచి కోలుకోకముందే ఆయన సతీమణి రుక్మిణి గారు కూడా లోకం వీడడం బాధాకరం. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, భర్త మరణం తర్వాత తీవ్రంగా కృంగిపోయారు. కోటా జ్ఞాపకాలను తలచుకుంటూ మానసికంగా కుంగిపోయిన ఆమె ఆరోగ్యం క్షీణించింది. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించక చివరికి కన్నుమూశారు.

- ఒకే కుటుంబంలో వరుస విషాదాలు

కోటా కుటుంబం గతంలోనూ తీవ్ర విషాదాలను ఎదుర్కొంది. 2010లో వారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ సంఘటన రుక్మిణి గారిని తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది. కొడుకు జ్ఞాపకాలతో తల్లడిల్లిపోయిన ఆమె, భర్త మరణంతో మరింతగా కుమిలిపోయారు. ఇప్పుడు కోటా దంపతులు ఇద్దరూ మరణించడంతో వారి కుమార్తె ఒంటరిగా మిగిలిపోయారు.

- నివాళులర్పించిన సినీ ప్రముఖులు

కోటా రుక్మిణి గారి పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. భర్తను కోల్పోయిన నెలలోనే భార్యను కూడా కోల్పోవడం కోటా కుటుంబానికి తీరని లోటని పలువురు సినీ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. కోటా దంపతులు తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతారని వారు అన్నారు.

ఈ విషాద సమయంలో కోటా కుటుంబానికి సినీ పరిశ్రమ.. అభిమానులంతా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ వరుస మరణాలు తెలుగు చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచెత్తాయి.