టీడీపీలో మంత్రి 'కొండపల్లి' ని టార్గెట్ చేస్తోందెవరు..?
ఇటు జిల్లాలో ప్రజాప్రతినిధులతోనూ, జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడ చక్కటి సమన్వయంతో కొండపల్లి ముందుకు వెళుతున్నారు.
By: Garuda Media | 10 April 2026 4:00 AM ISTఆంధ్రప్రదేశ్ కేబినెట్లో యువ మంత్రిగా ఉన్న కొండపల్లి శ్రీనివాస్ను సొంత పార్టీకే చెందిన కొందరు నేతలు వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తున్నట్టుగా విజయనగరం జిల్లా రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. బలమైన కొండపల్లి రాజకీయ కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కొండపల్లి శ్రీనివాస్ గత ఎన్నికల్లో గజపతినగరం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు చంద్రబాబు కేబినెట్లో మంత్రి అయ్యారు. చంద్రబాబుతో పాటు యువనేత లోకేష్ అండదండలు పుష్కలంగా ఉండడంతో ఇటు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, అటు మంత్రిగా తనదైన ముద్రవేస్తున్నారు. అటు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ 21 నెలల కాలంలో క్లీన్ ఇమేజ్తోనే వెళుతున్నారు. తాను వ్యక్తిగతంగా చిన్న రిమార్క్ లేకుండా వెళుతున్నారు.
విచత్రం ఏంటంటే మంత్రి కొండపల్లిపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు పెద్దగా విమర్శలు చేసింది లేదు. కానీ సొంత పార్టీకే చెందిన నాయకులు మాత్రం వ్యూహాత్మకంగా టార్గెట్ చేసేలా పావులు కదుపుతున్నట్టు జిల్లా రాజకీయాల్లో ప్రచారం అండర్ కరెంట్గా నడుస్తోంది. తొలిసారి గెలిచినా మంత్రి అవ్వడం, చంద్రబాబు దృష్టిలో క్లీన్ఇమేజ్తో ఉండడం, అవినీతి, దూకుడు రాజకీయాలకు దూరంగా ఉండడం, ఇటు యువనేత నారా లోకేష్ టీంలో భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ పోషించే యంగ్ లీడర్గా ప్రొజెక్ట్ అవుతుండడం సహజంగానే సొంత పార్టీలో కొందరికి నచ్చట్లేదు. మరీ ముఖ్యంగా తూర్పు కాపు సామాజిక వర్గంలో ఫ్యూచర్లో లోకేష్ టీంలో అత్యంత బలమైన నేతగా కొండపల్లి ఉండనున్నారు.
ఇటు జిల్లాలో ప్రజాప్రతినిధులతోనూ, జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడ చక్కటి సమన్వయంతో కొండపల్లి ముందుకు వెళుతున్నారు. తాజాగా చంద్రబాబు ప్రతి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతూ జిల్లా ర్యాంకులు ఇస్తున్న క్రమంలోనే విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలిచింది. ఈ విషయంలోనూ కొండపల్లికి ముఖ్యమంత్రి కితాబు ఇచ్చారు. చంద్రబాబు తాజా ర్యాకింగుల్లో రాష్ట్రస్థాయిలో ఎమ్మెల్యేగా కొండపల్లి 17వ ర్యాంకులో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో గతేడాది 8వ ర్యాంకులో ఉంటే ఇప్పుడు 1వ ర్యాంకులో ఉన్నారు.
అటు శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జ్ మంత్రిగాను అక్కడ కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను స్వమన్వయం చేసుకుంటూ జిల్లాలోను, అధిష్టానం వద్ద ప్రశంసలు అందుకున్నారు. ఉత్తరాంధ్రకే మణిహారం అయిన భోగాపురం ఎయిర్పోర్టు పనులతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తు పనులు చకచకా పూర్తయ్యేలా మానిటరింగ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సొంత పార్టీలో కొందరు కొండపల్లి క్రేజ్ పెరిగితే రాజకీయంగా తాము ఎక్కడ డౌన్ అవుతామో అన్న ఇంటెన్షన్తోనే కొండపల్లిని ఏదోలా టార్గెట్ చేయడం ? లేదా వ్యూహాత్మకంగా నియంత్రించేందుకు తెరవెనక పావులు కదుపుతుండడం జరుగుతోందని జిల్లాలో సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.
