Begin typing your search above and press return to search.

ఇబ్బంది పెడుతున్నారు.. అధిష్టానం వద్ద కొండా సురేఖ ఆవేదన

తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చుట్టూ జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

By:  A.N.Kumar   |   17 Oct 2025 10:21 AM IST
ఇబ్బంది పెడుతున్నారు.. అధిష్టానం వద్ద కొండా సురేఖ ఆవేదన
X

తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చుట్టూ జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తనను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం జరుగుతోందని ఆమె కాంగ్రెస్ ముఖ్య నాయకుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

* ఓఎస్డీపై చర్యలు: వివాదానికి దారితీసిన ఘటన

బుధవారం రాత్రి మంత్రి సురేఖ ఓఎస్డీగా పనిచేసిన సుమంత్‌పై పోలీసులు చర్యలు చేపట్టడం, ఆయన కోసం ఏకంగా మంత్రి నివాసం వద్దకు పోలీసులు చేరుకోవడం పెద్ద వివాదానికి దారితీసింది. ఈ సంఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన సురేఖ, గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి హాజరుకాలేదు. బదులుగా ఆమె ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లను వరుసగా కలిసి తన ఆవేదన వ్యక్తం చేశారు.

* పోలీసుల చర్యలకు సీఎం ఆదేశాలు?

సూర్యాపేట జిల్లాలోని డెక్కన్‌ సిమెంట్స్‌ కంపెనీ యాజమాన్యాన్ని సుమంత్‌ బెదిరించాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రికి నివేదించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, సీఎం తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

దీంతో, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సుమంత్‌ కదలికలను గమనించి, ఆయన జూబ్లీహిల్స్‌లోని మంత్రి సురేఖ ఇంట్లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మఫ్టీలో ఉన్న పోలీసులు మంత్రి ఇంట్లోకి వెళ్లడం, ఆమె కుమార్తె వారితో వాగ్వాదానికి దిగడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ మొత్తం ఘటన రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.

* మీడియాకు దూరంగా ఉండాలని ఏఐసీసీ ఇన్‌ఛార్జి సూచన

ఈ ఘటనపై సురేఖ మీడియాతో మాట్లాడతారని తెలిసి, ఏఐసీసీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆమెకు ఫోన్‌ చేసి వివాదంపై వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. అనంతరం సురేఖ తన కుమార్తె కొండా సుస్మితతో కలిసి ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లి మీనాక్షి, మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో భేటీ అయ్యారు. తమపై జరుగుతున్న కుట్రలు, పార్టీ అంతర్గత విభేదాల కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని సురేఖ వివరించినట్లు సమాచారం.

* 'సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు' - కొండా సురేఖ

పార్టీ పెద్దలతో భేటీ అనంతరం సురేఖ మీడియాతో మాట్లాడుతూ “నా ఇబ్బందులను, ఆలోచనలను పార్టీ పెద్దలతో పంచుకున్నాను. వారు సమన్వయం చేస్తామని, సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక నాకు పార్టీపై నమ్మకం ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా” అని తెలిపారు.

* సీఎం రేవంత్‌పై అభిమానమే - కొండా మురళి

ఇదే అంశంపై సురేఖ భర్త కొండా మురళి స్పందిస్తూ “ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నేను అభిమానిస్తా. ఆయన సీఎం కావాలని నేను కోరుకున్నాను. ఎవరో మన మధ్య విరోధం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విషయమైనా సీఎంను నేరుగా కలసి మాట్లాడుతా” అని చెప్పారు. అలాగే, రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఎమ్మెల్సీ హామీపై తనకు విశ్వాసం ఉందన్నారు.

* భద్రత తొలగింపుపై స్పష్టీకరణ

హనుమకొండలోని సురేఖ నివాసం వద్ద భద్రత తొలగించారన్న ప్రచారం సోషల్ మీడియాలో రావడంతో, మంత్రి కార్యాలయం దాన్ని ఖండించింది. “భద్రత ఎలాంటి రీతిలోనూ తొలగించలేదు” అని స్పష్టం చేసింది.

*అంతర్గత సవాళ్ల ప్రతిబింబం

మొత్తం పరిణామాలను గమనిస్తే, మంత్రి కొండా సురేఖ చుట్టూ జరుగుతున్న ఘటనలు కేవలం ఒక ఓఎస్డీ వ్యవహారం మాత్రమే కాదని, ఇది పార్టీలో ఉన్న అంతర్గత రాజకీయ సవాళ్ల ప్రతిబింబంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.