నాని ఈజ్ బ్యాక్! జగన్తో భేటీలో కీలక నిర్ణయం.. ఇక రచ్చరచ్చే..
తాజాగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన కొడాలి నాని అధినేత జగన్మోహనరెడ్డితో భేటీ అయ్యారని చెబుతున్నారు.
By: Tupaki Political Desk | 14 May 2026 4:00 PM ISTకృష్ణా జిల్లా వైసీపీ పాలిటిక్స్ లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని తిరిగి యాక్టివ్ అవుతున్నారంటూ ఒక్కసారిగా ప్రచారం ఊపందుకుంది. తాజాగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన కొడాలి నాని అధినేత జగన్మోహనరెడ్డితో భేటీ అయ్యారని చెబుతున్నారు. వీరిద్దరి మధ్య అనేక రాజకీయాంశాలు చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రధానంగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాలని నానికి జగన్ రెడ్డి హితబోధ చేశారంటున్నారు.
అధినేత జగన్ రెడ్డి సూచనతో మాజీ మంత్రి కొడాలి నాని మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించినట్లు సమాచారం. తన సొంత నియోజకవర్గం గుడివాడతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లా బాధ్యతలను నానికి అప్పగించాలని జగన్ రెడ్డి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో దూకుడు చూపిన నాని వైసీపీ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఎదిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పై తీవ్ర విమర్శలు చేస్తూ తన కంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో నాని కొన్నాళ్లు వెనక్కి తగ్గారని అంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల టార్గెట్ గా అరెస్టుల పర్వం కొనసాగింది. మాజీ మంత్రి నానిని అరెస్టు చేస్తారంటూ కొన్నాళ్లు తీవ్రమైన ప్రచారం జరిగింది. దీంతో ఆయన కొన్నాళ్లు తెరమరుగైనట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో అనారోగ్యం పాలవడంతో సుమారు ఏడాదిన్నరగా విశ్రాంతి తీసుకుంటున్నారు. మధ్యలో కొద్ది రోజులు సొంత నియోజకవర్గానికి వచ్చి వెళుతున్నా, పార్టీ తరఫున కార్యక్రమాలకు దూరంగానే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో అధినేత జగన్ రెడ్డి ఒకటి రెండు సార్లు ఒత్తిడి తీసుకువచ్చినా, అరోగ్య కారణాల రీత్యా కొడాలి పార్టీ కార్యక్రమాలకు హాజరుకాలేకపోయారని చెబుతున్నారు.
ఇక లండన్ పర్యటనకు ముగించుకుని వచ్చిన జగన్ రెడ్డిని మాజీ మంత్రి కొడాలి నాని ప్రత్యేకంగా కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో ఇద్దరు చాలా అంశాలను చర్చించుకున్నారని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుండటం, మరో రెండేళ్లు కష్టపడితే పార్టీని బలోపేతం చేసుకోవచ్చని ఇరువురు నేతలు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. మరో ఏడాది తర్వాత తాను పాదయాత్ర చేస్తానని జగన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసినందున మాజీ మంత్రి కొడాలి వచ్చే ఏడాది పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా ఉండాలని మాజీ సీఎం జగన్ దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. మొత్తానికి కొడాలి యాక్టివ్ అవ్వనున్నారనే ప్రచారం వైసీపీ వర్గాలను ఆకర్షిస్తోందని చెబుతున్నారు.
