Begin typing your search above and press return to search.

కేకే సర్వే సంచలనం : జూబ్లీహల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిదంటే?

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కిరణ్ కోటేటి (కేకే) సర్వే విడుదల చేసిన ఫలితాలు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీశాయి.

By:  A.N.Kumar   |   1 Nov 2025 10:38 PM IST
కేకే సర్వే సంచలనం : జూబ్లీహల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిదంటే?
X

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కిరణ్ కోటేటి (కేకే) సర్వే విడుదల చేసిన ఫలితాలు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. నవంబర్ 11న జరగనున్న ఈ కీలకమైన బైపోల్‌లో అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అయితే, కేకే సర్వే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా సంచలన అంచనాలు వేసింది.

*నియోజకవర్గ స్థాయిలో కేకే సర్వే అంచనా

కేకే సర్వే ప్రకారం, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి విజయం సాధించే దిశగా పయనిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఏకంగా 55 శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది.

బీఆర్ఎస్: 55%

కాంగ్రెస్: 37%

బీజేపీ: మిగిలిన శాతం (మూడో స్థానంలో పరిమితం)

ఈ అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీ 37 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలవగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభావం తగ్గడంతో అది మూడో స్థానానికే పరిమితమవుతుందని తెలుస్తోంది. బీజేపీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్‌కు మళ్లడం గులాబీ పార్టీకి అదనపు బలం చేకూర్చుతుందని కేకే విశ్లేషించారు.

జోన్ల (డివిజన్ల) వారీగా బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం

నియోజకవర్గంలోని పలు డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ ఏకపక్ష ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. ఈ డివిజన్లలోని మెజారిటీ ఓట్ల వల్లే నియోజకవర్గం మొత్తంలో బీఆర్ఎస్‌కు 55 శాతం ఓట్ల అంచనా సాధ్యమైందని కేకే సర్వే విశ్లేషించింది.

విజన్ బీఆర్ఎస్ (%) కాంగ్రెస్ (%) బీజేపీ (%)

బొరబండ 63.2 31.6 5.2

శ్రీనగర్ కాలనీ 61.9 33.3 4.8

ఎర్రగడ్డ 61.6 31.7 6.7

షేక్‌పేట 60.1 33.0 6.9

బొరబండ, శ్రీనగర్ కాలనీ, ఎర్రగడ్డ, షేక్‌పేట ప్రాంతాల్లో బీఆర్ఎస్ 60 శాతం మార్కును దాటి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్న ప్రాంతాలు

మరోవైపు, కొన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్నట్లు సర్వే పేర్కొంది. రహమత్‌నగర్ , వెంగళరావు నగర్లలో కాంగ్రెస్ బలంగా ఉంది.

రహమత్‌నగర్: కాంగ్రెస్ 51.1% ఓట్లతో ముందంజలో ఉంది.

వెంగళరావు నగర్: కాంగ్రెస్ 48.5% ఓట్లతో స్వల్ప ఆధిక్యంలో ఉంటుంది.

యూసఫ్‌గూడ: ఇక్కడ బీఆర్ఎస్ (47.1%) , కాంగ్రెస్ (45.5%) మధ్య గట్టి పోటీ నెలకొంది, బీఆర్ఎస్ స్వల్పంగా ఆధిక్యంలో ఉంది.

మైనార్టీ ఓట్లు.. అభ్యర్థి వ్యక్తిగత బలం కాంగ్రెస్‌కు ఈ ప్రాంతాల్లో ఉపయోగపడుతున్నట్లు సర్వే సూచిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ (ఎంఐఎం) మద్దతు ప్రకటించడం, మాజీ క్రికెటర్‌ మహ్మద్ అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటామన్న నిర్ణయం మైనారిటీ ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా.

*కేకే సర్వే విశ్వసనీయత

2019 , 2024 ఎన్నికల్లో కేకే సర్వే అంచనాలు నిజమైన నేపథ్యాన్ని బట్టి, ఈసారి కూడా ఈ సర్వే ఫలితాలను ప్రజలు, రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ముమ్మరంగా పనిచేస్తుండగా.. స్థానికంగా మాగంటి సునీతకు ఉన్న మంచి ఇమేజ్ కూడా విజయావకాశాలను పెంచుతుందని సర్వే పేర్కొంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేకే అంచనాలు మరోసారి నిజమవుతాయా, లేక ప్రజల తీర్పు భిన్నంగా ఉంటుందా అనేది నవంబర్ 14న ఫలితాల ప్రకటనతో తేలనుంది.