బెజవాడ 'బిగ్ బ్రదర్' పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా ..!
అయితే.. ఏ పార్టీ తరఫున అనేది పక్కన పెడితే.. అవసరమైతే ఇండిపెండెంటుగా అయినా.. నానీ ప్రయత్నం చేయొచ్చని ఆయన అనుచరులు చెబుతుండడం గమనార్హం.
By: Garuda Media | 29 Jun 2026 8:00 PM ISTబెజవాడలో `బిగ్ బ్రదర్`గా గుర్తింపు తెచ్చుకున్న కేశినేని నాని.. తిరిగి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? ఆయన మళ్లీ వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఈ సారి ఖచ్చితంగా గెలుపే లక్ష్యంగా నానీ అడుగులు వేస్తారని చెబుతున్నారు. అయితే.. ఏ పార్టీ తరఫున అనేది పక్కన పెడితే.. అవసరమైతే ఇండిపెండెంటుగా అయినా.. నానీ ప్రయత్నం చేయొచ్చని ఆయన అనుచరులు చెబుతుండడం గమనార్హం.
గత 2014 ఎన్నికల్లో తొలిసారి రాజకీయ అరంగేట్రం చేసిన నానీ.. ఒక వైపు ట్రావెల్స్ వ్యాపారం చేసుకుం టూనే మరోవైపు టీడీపీ తరఫున ఎంపీగా విజయం దక్కించుకున్నారు. 2019లోనూ ఆయన టికెట్ తెచ్చు కుని వరుస విజయాలు కైవసం చేసుకున్నారు. నిజానికి ఆ ఎన్నికల్లో హేమా హేమీలే పరాజయం పాలయ్యారు. కానీ.. నానీ మాత్రం విజయవాడ ఎంపీగా విజయం దక్కించుకున్నారు. అయితే.. గత ఎన్నికలకు ముందు టీడీపీతో ఏర్పడిన వివాదం.. ఆయనను బయటకు వచ్చేలా చేసింది.
ఈ క్రమంలోనే వైసీపీ తరఫున పోటీ చేశారు. కానీ, పరాజయం పాలయ్యారు. దీంతో ఇక రాజకీయాలకు దూరమంటూ ఆవేశంగా నిర్ణయం తీసుకుని ఇంటికే పరిమితమయ్యారు. ఇది నానీకి కలిసి రాలేదన్నది ఆయన అనుచరులు చెబుతున్న మాట. దాదాపు 12 ఏళ్లపాటు రాజకీయాలు చేసి.. తర్వాత ఒక్కసారిగా మానేయడంతో చిక్కుల్లో పడ్డారని అంటున్నారు. ముఖ్యంగా అన్ని విధాలా నష్టపోతున్నారన్నది వారు చెబుతున్న మాట.
మరోవైపు.. సొంతసోదరుడు, ప్రస్తుత ఎంపీ చిన్నీ నుంచి ఎదురవుతున్న దూకుడుకు నానీ ఇబ్బంది పడుతున్నారన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తిరిగి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని నానీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. రాజకీయంగా లేకపోతే.. అనేక రూపాల్లో ఇబ్బందులు వస్తున్నాయని. ముఖ్యంగా వ్యక్తిగత ఇమేజ్ కూడా తగ్గిపోయిందని భావిస్తున్నారు. అందుకే రీ ఎంట్రీ ఇస్తున్నారని బిగ్ బ్రదర్పై ఆసక్తికర కథనాలు కూడా వస్తున్నాయి. అయితే.. దీనిపై అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంటుంది.
