Begin typing your search above and press return to search.

'రెడ్ల' సుదీర్ఘ క‌ల‌ను సాకారం చేసిన టీడీపీ ఎమ్మెల్యే.. !

వైసీపీ అధికారంలో ఉండ‌గా చేయ‌ని ప‌నిని.. టీడీపీ ఎమ్మెల్యే చేసిపెట్టారు. రెడ్డి సామాజిక వ‌ర్గం సుదీర్ఘ కాలంగా ఓ కీల‌క డిమాండ్ చేస్తోంది.

By:  Garuda Media   |   18 Jan 2026 5:00 AM IST
రెడ్ల సుదీర్ఘ క‌ల‌ను సాకారం చేసిన టీడీపీ ఎమ్మెల్యే.. !
X

వైసీపీ అధికారంలో ఉండ‌గా చేయ‌ని ప‌నిని.. టీడీపీ ఎమ్మెల్యే చేసిపెట్టారు. రెడ్డి సామాజిక వ‌ర్గం సుదీర్ఘ కాలంగా ఓ కీల‌క డిమాండ్ చేస్తోంది. అయితే.. అది వైసీపీ హ‌యాంలో సాకారం అవుతుంద‌ని భావించారు. కానీ, చిత్రం ఏంటంటే.. అది సాకారం కాలేదు. క‌నీసంప‌ట్టించుకోను కూడా ప‌ట్టించుకోలేదు. కానీ.. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఈ వ్య‌వ‌హారంపై దృష్టి పెట్ట‌డ‌మే కాకుండా.. ప్ర‌భుత్వంతో మాట్లాడి.. రెడ్డి సోద‌రుల విజ్ఞ‌ప్తిపై క‌స‌ర‌త్తు చేసి.. సాధించారు.

అదే.. వేమ‌న జ‌యంతిని రాష్ట్ర పండుగ‌గా గుర్తించ‌డం.. ప్ర‌భుత్వం నుంచి నిధులు మంజూరు అయ్యేలా చేయ‌డం!. స‌ర్కారు ఆధ్వ‌రంలో ఈ పండుగ‌ను నిర్వ‌హించ‌డం. వేమ‌న అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న చెప్పిన ప‌ద్యాలు ఇప్ప‌టికీ గ్రామాల్లోనే కాకుండా.. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లోనూ వినిపిస్తాయి. `విశ్వ‌దాభిరామ‌.. వినుర వేమ‌` అనే మ‌కుటంతో ఆయ‌న చెప్పిన ప‌ద్యాలు.. జీవిత స‌త్యాలు.. జీవ‌న స‌త్యాలుగా ప్ర‌జ‌ల్లో జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఇప్ప‌టికీ ఉప్పు-క‌ప్పురంబు.. అనే వేమ‌న ప‌ద్యం అంద‌రి నోళ్ల‌పై క‌ద‌లాడుతూనే ఉంటుంది.

వేమ‌న అస‌లు పేరు వేమా రెడ్డి. ఈయ‌న క‌డ‌ప-అనంత‌పురంజిల్లాల‌కు చెందిన వారుగా చ‌రిత్ర చెబుతోంది. కొన్ని పుస్త‌కాల్లో వేమ‌న‌.. క‌డ‌ప జిల్లాకు చెందిన వారుగా ఉంది. కానీ, మ‌రికొన్ని పుస్త‌కాలు.. చరిత్ర‌ను బ‌ట్టి వేమ‌న అనంత‌పురం-క‌డ‌ప జిల్లాల మ‌ధ్య జ‌న్మించిన‌ట్టు ఉంది. అయితే..ఆ య‌న అనంత‌పురంలో జ‌న్మించార‌ని.. జీవ స‌మాధి మాత్రం క‌డ‌ప‌లో జ‌రిగింద‌ని అంటారు. రెడ్డి సామాజిక వ‌ర్గంలో వేమ‌నకు అగ్ర‌గ‌ణ్య‌మైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌లో రెడ్డి సామాజిక వ‌ర్గం వేమ‌న‌కు ప్రాధాన్యం ఇస్తుంది.

ఈ క్ర‌మంలోనే ఉమ్మ‌డి అనంతపురంలోని కటారు పల్లిలో వేమ‌న‌కు గుడి కూడా ఉంది. ఇక్క‌డే ఈ నెల 19న వేమ‌న జ‌యంతిని అధికారికంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి టీడీపీ క‌దిరి ఎమ్మెల్యే కందికుంట వెంక‌ట ప్ర‌సాద్.. ఎంతో కృషి చేశారు. రెడ్డి సామాజిక వ‌ర్గం అభ్య‌ర్థ‌న‌ను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి.. యోగి వేమన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు అనుమతి తెచ్చారు. అంతేకాదు.. నిధులు కూడా కేటాయించేలా చేశారు. 3 కోట్ల రూపాయ‌ల నిధుల‌ను ప్ర‌భుత్వం కేటాయింది.

దీంతో కటారుపల్లిలోని యోగి వేమన ఆలయాన్ని సుంద‌రంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం వసతిగృహాలు, మరుగుదొడ్ల మరమ్మతులు, వివిధ ఏర్పాట్లు, అభివృధ్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటిని నిరంత‌రం ఎమ్మెల్యే కందికుంట ప‌రిశీలిస్తున్నారు. ప‌నులు వేగంగా జ‌రిగేలా చేస్తున్నారు. ఈ ప‌రిణామంతో రెడ్డి సామాజిక వ‌ర్గం నేత‌లు.. కందికుంట‌కు జై కొడుతున్నారు.