Begin typing your search above and press return to search.

సనాతన ధర్మంపై నోరుపారేసుకున్న కమల్ హాసన్!

సూర్య స్థాపించిన 'ఆగరం ఫౌండేషన్' కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీగా పాల్గొన్న కమల్ హాసన్, విద్యపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

By:  A.N.Kumar   |   4 Aug 2025 12:13 PM IST
సనాతన ధర్మంపై నోరుపారేసుకున్న కమల్ హాసన్!
X

సినీ నటుడు , రాజకీయ నాయకుడైన కమల్ హాసన్ మరోసారి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలతో పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు.. విమర్శలకు దారితీశాయి. విద్య అనేది నియంతృత్వాన్ని ఎదుర్కొనేందుకు ఒక ఆయుధం లాంటిదని, ఇది సనాతన సిద్ధాంతాలను బ్రేక్ చేస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి ప్రధాన కారణం అయ్యాయి.

సూర్య స్థాపించిన 'ఆగరం ఫౌండేషన్' కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీగా పాల్గొన్న కమల్ హాసన్, విద్యపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. సనాతన ధర్మం ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చిందని, అది అజ్ఞానం నుండి విముక్తిని కలిగించేదే అని కొందరు వాదిస్తున్నారు. కమల్ హాసన్ విద్యను సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చూపించడం హిందూ సంప్రదాయాలపై దాడిగా భావించవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

నెటిజన్ల కౌంటర్లు - అభిప్రాయాలు

కమల్ హాసన్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా కౌంటర్ ఇస్తున్నారు. వాస్తవాలను తెలియజేసే విద్యే నిజమైన ఆయుధమని, కానీ ఆ వాస్తవాలను సనాతన ధర్మంపై అర్థం కాని విమర్శలుగా మార్చడం సరికాదని ఒక నెటిజన్ పేర్కొన్నారు. మరొకరు కమల్ హాసన్ ధార్మిక విశ్వాసాలను కించపరచడాన్ని తప్పుబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా కమల్ హాసన్ హిందూ సంప్రదాయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందని కొందరు పేర్కొంటున్నారు.

సనాతన ధర్మానికి ప్రజల మద్దతు

సనాతన ధర్మం శతాబ్దాలుగా భారతీయ సమాజానికి మార్గదర్శకంగా ఉందని చాలా మంది నమ్ముతారు. అటువంటి సందర్భంలో కమల్ హాసన్ వ్యాఖ్యలు వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉన్నప్పటికీ, దేశీయ సంప్రదాయాలను గౌరవించడం అందరి బాధ్యత అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యల కంటే ప్రజల మనోభావాలను గౌరవించడమే బాధ్యత గల నాయకునికి తగిన మార్గమని చాలా మంది పేర్కొంటున్నారు.