జూబ్లిహిల్స్ బైపోల్ : బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. ఊహించని ట్విస్ట్
జూబ్లీహిల్స్ ఓటర్లు గతంలో రెండు సార్లు మాగంటి గోపీనాథ్ను గెలిపించారని గుర్తు చేసిన కేటీఆర్, ఈసారి కూడా సునీతకు ఆశీర్వాదం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
By: A.N.Kumar | 19 Sept 2025 10:20 PM ISTజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే జరగుతున్న ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. అధికార కాంగ్రెస్ గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తుండగా.. ప్రతిపక్ష బీజేపీ కూడా వ్యూహాలు మార్చుకుంటోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ మాత్రం వేగంగా ముందడుగు వేసింది.
* బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు
బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తన అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను పోటీలో నిలబెట్టనుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మాగంటి గోపీనాథ్ చేసిన సేవలను కొనసాగించడానికి సునీత ముందుకు వచ్చారని, ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త ఆమె గెలుపు కోసం కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
* కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఓటర్లు గతంలో రెండు సార్లు మాగంటి గోపీనాథ్ను గెలిపించారని గుర్తు చేసిన కేటీఆర్, ఈసారి కూడా సునీతకు ఆశీర్వాదం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, కాంగ్రెస్–బీజేపీ జాయింట్ వెంచర్లా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. ముస్లిం నేతల ప్రాతినిధ్యం లేకుండా తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శించారు.
కాంగ్రెస్ వ్యూహం
ఇక కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి ఎంపికలో ఆలస్యం చేస్తోంది. అజహారుద్దీన్ను ఎమ్మెల్సీగా చేసిన తరువాత, ఈ సీటు నుంచి బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే, పార్టీ లోపల పోటీ ఎక్కువగా ఉండటంతో అభ్యర్థి ఎంపిక కాస్త క్లిష్టంగా మారింది.
బీజేపీ, ఎంఐఎం ల లెక్కలు
బీజేపీ ఈ సీటును దక్కించుకోవడానికి సామాజిక సమీకరణాలను క్షుణ్ణంగా విశ్లేషిస్తోంది. గత ఎన్నికల ఫలితాల దృష్ట్యా అభ్యర్థి ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. మరోవైపు ఎంఐఎం తీసుకునే నిర్ణయం కూడా కాంగ్రెస్పై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది.
అసలు పోరాటం ముందే ప్రారంభం
బీఆర్ఎస్ ఇతర పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ప్రచారం మొదలుపెట్టడంతో జూబ్లీహిల్స్లో వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. దీంతో ఈ ఉప ఎన్నిక నిజమైన ప్రతిష్ఠ పోరాటంగా మారింది. రాబోయే రోజుల్లో ఎవరి వ్యూహం విజయవంతమవుతుందో, ఓటర్ల మద్దతు ఎవరికీ దక్కుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు వేదిక కానుంది.
