జూబ్లీహిల్స్లో మంత్రికి చుక్కెదురు.. ఏం జరిగిందంటే!
మంత్రి జూపల్లి కృష్ణారావును, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను ఓ వృద్ధురాలు నిలదీశారు. ఎన్నికల ముందు చెప్పినట్టు 4 వేల పెన్షన్ ఎక్కడని ఆమె ప్రశ్నించారు.
By: Garuda Media | 30 Oct 2025 9:22 PM ISTజూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా.. పార్టీలు తమ తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నా యి. మరో 10 రోజుల్లోనే ఇక్కడ పోలింగ్ జరగనుంది(నవంబరు 11). దీంతో అధికార పార్టీ కాంగ్రెస్ తరఫున మంత్రులు బరిలోకి దిగారు. ఇంటింటికీ తిరుగుతున్నారు. తమ ప్రభుత్వం ఏం చేసిందో వివరిస్తూ.. గత కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు కొంత సానుకూలంగా సాగిన ఈ ప్రచార పర్వంలో తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావుకు చుక్కెదురైంది.
మంత్రి జూపల్లి కృష్ణారావును, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను ఓ వృద్ధురాలు నిలదీశారు. ఎన్నికల ముందు చెప్పినట్టు 4 వేల పెన్షన్ ఎక్కడని ఆమె ప్రశ్నించారు. కరెంట్ బిల్లు కూడా వస్తోందని, ఎన్నికలకు ముందు మీరు కరెంటు బిల్లు ఉండదని, ఉచితంగా విద్యుత్ ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందన్నారు. అంతేకాదు.. ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వస్తారు కానీ.. మిగతా సమయంలో పట్టించుకోరా? అని మంత్రిని అడిగారు. మంత్రి ఆమెకు సర్ధిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోలేదు.
ఇక.. ఈ సమయంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తున్నామని.. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామన్నారు. 200 యూనిట్లకు మించిన వారికే బిల్లులు వస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా పింఛన్లను కూడా 500 చొప్పున పెంచే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అయితే.. మంత్రి చెప్పిన విషయాలను వృద్ధురాలు వినిపించుకోకపోవడంతో మంత్రి జూపల్లి మహాభారతం ప్రస్తావన తీసుకువచ్చారు.
``మహాభారతం విన్నారా? చదివారా..? అందులో అశ్వద్ధామ అతః``వరకే పైకి చెప్పి.. కుంజరః అనేది లైట్ చేశారు. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నలకు నేను సమాధానం చెబుతుంటే.. మీరు కూడా సగమే విని మిగిలింది వినిపించుకోవడం లేదు`` అని మంత్రి వ్యాఖ్యానించారు. అనంతరం.. అన్నీ అమలు చేస్తామని.. కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని చెప్పారు. కేసీఆర్ హయాంలో ఏమీ జరగలేదని చెప్పుకొంటూ.. అక్కడి నుంచి వెశ్లిపోయారు.
