కేరళం నుంచే పవన్...పవర్ ఫుల్ లోకల్ వ్యూహం !
స్థానిక సంస్థల ఎన్నికలను జనసేన ఎంత పట్టుదలగా ప్రతిష్టగా తీసుకుంటోంది అన్నది అందరికీ తెలిసిందే.
By: Satya P | 27 Aug 2026 9:17 AM ISTస్థానిక సంస్థల ఎన్నికలను జనసేన ఎంత పట్టుదలగా ప్రతిష్టగా తీసుకుంటోంది అన్నది అందరికీ తెలిసిందే. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ 30 శాతం కంటే తక్కువ సీట్లలో పోటీ చేసేది లేదని జనసేన అధినాయకత్వం ఫుల్ క్లారిటీతో ఉంది. మిత్రుల మధ్య సీట్ల సర్దుబాటు 2026 లో ఉన్న బలాబలాల ఆధారంగా జరగాలని కూడా గట్టిగా కోరుతోంది. 2024 కంటే ఇపుడు తమకు ఎంతో బలం పెరిగిందని కూడా చెబుతోంది. తగ్గేది లేదన్న సందేశాన్ని బిగ్గరగానే కూటమిలో వినిపిస్తోంది. దాంతో సీట్ల సర్దుబాటు ఏ విధంగా సాగుతుంది అన్న చర్చ ఒక వైపు ఉండగానే జనసేన తన పార్టీని స్థానిక ఎన్నికల వైపు వడివడిగా నడిపిస్తోంది. ప్రస్తుతం కేరళంలో ప్రకృతి వైద్యం తీసుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ నుంచే మొత్తం లోకల్ బాడీ ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.
జనసేన ఆత్మీయ సమావేశం :
ఈ నేపథ్యంలో జనసేన ఆత్మీయ సమావేశాన్ని ఈ నెల 28వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కీలకమైన సమావేశంలో జనసేన పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోపాటు, పార్టీ నుంచి వివిధ బాధ్యతలలో ఉన్న పలు కార్పొరేషన్ చైర్మన్లు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన జనసేన అభ్యర్థులు, అలాగే 2021 స్థానిక ఎన్నికల్లో కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా పార్టీ తరఫున పోటీ చేసిన వారు ఈ కీలకమైన సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలలో అనేక అడ్డంకులను రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా జడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా వందలమంది జనసేన నుంచి పోటీ చేసిన నేపధ్యంలో ఈ ఆత్మీయ సమావేశంలో వీరిని ఏరి కోరి మరీ భాగస్వాములను చేశారు.
పవన్ మార్గదర్శకత్వంలో :
ఇక జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావడంపై ఈ ఆత్మీయ సమావేశంలో చర్చిస్తారని చెబుతున్నారు. పవన్ అందించిన మార్గదర్శకాలు ఆయన ఇచ్చిన సూచనలను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వివరిస్తారని అంటున్నారు. ఈ సమావేశానికి ముందు అదే రోజున స్థానిక ఎన్నికల విధి విధానాల కోసం 14 మంది సభ్యులతో ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీ సమావేశం కూడా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంటుందని అంటున్నారు. అంటే పకడ్బందీగానే ఈ కీలక సమావేశం జరుగుతుందని అంటున్నారు. ఈ సందర్భంగా స్థానిక వ్యూహాన్ని జనసేన చర్చిస్తుందని చెబుతున్నారు.
జనసేన బలంతోనే :
జనసేనకు బలం ఉన్న చోట సీటు తీసుకోవాల్సిందే పోటీ చేయాల్సిందే అన్నది పార్టీ ఆలోచనగా ఉంది. పార్టీ విస్తరణకు పటిష్టతకు ఇంతకు మించిన చాన్స్ వేరొకటి రాదని కూడా భావిస్తున్నారు. అంతే కాదు పార్టీలో పోటీ చేసేందుకు ఎంతో మంది ఉత్సాహవంతులు సిద్ధంగా ఉన్నారని వారిలో నిలిచి గెలిచే వారికి టికెట్లు ఇస్తామని పార్టీ వర్గాలు అంటున్నారు. జనసేన పోటీ చేసే చోట్ల మిత్రులు సహకరించాలని కూడా కోరబోతున్నారు. అలాగే మిత్రులు పోటీ చేసిన చోట జనసేన నుంచి కూడా సహకారం ఉంటుందని స్పష్టంగా చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి అవకాశం ఇవ్వకుండా కూటమి ఐక్యతను చాటుకోవాలని కూడా జనసేన అభిప్రాయపడుతోంది.
