బాబుకు దేవుడంటే భక్తి, భయం లేదు: జగన్
కులాలను, మతాలను రెచ్చగొడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. మళ్లీ మళ్లీ అవే అబద్ధాలు చెబుతూ.. రాష్ట్రంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని
By: Garuda Media | 4 Feb 2026 10:47 PM ISTఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు దేవుడంటే భక్తి, భయం లేదని వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపపై విచారణ జరిపిన సీబీఐ సిట్ నివేదిక ఇచ్చిందని.. అయితే.. తా ము అనుకున్న ప్రకారం నివేదిక ఇవ్వలేదన్న కారణంతో ఆ అక్కసును తమపై చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు ఆయన తనయుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తిరుమల శ్రీవారి ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు.
దీని వెనుక రాజకీయ దురుద్దేశమే ఉందని జగన్ ఆరోపించారు. దేవుండంటే చంద్రబాబుకు భయం, భక్తి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్డీడీబీ(నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు), ఎన్డీఆర్(నేషనల్ డెయిరీ రిసెర్చ్) సంస్థలే నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని రిపోర్టులు ఇచ్చాయని తెలిపారు. సీబీఐ సిట్ కూడా అన్ని పరీక్షలు చేసిందని.. అయినప్పటికీ చంద్రబాబు తమపై ఉద్దేశ పూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్, లోకేష్లు చేసిన తప్పులు, తప్పుడు ప్రచారాల పట్ల లెంపలు వేసుకోవాలని అన్నారు.
కులాలను, మతాలను రెచ్చగొడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. మళ్లీ మళ్లీ అవే అబద్ధాలు చెబుతూ.. రాష్ట్రంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, చంద్రబాబును ప్రశ్నించిన కారణంగానే దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడికి వెళ్లి వస్తున్న సమయంలో రాంబాబు అటకాయించారని, ఆయన ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. అంబటిని బూతులతో తిట్టడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని జగన్ ఆరోపించారు.
అండగా ఉంటా..
దీనికి ముందు జగన్.. గుంటూరు జిల్లాలోని అంబటి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. ఎలాంటి భయం అవసరం లేదని..తాను అండగా ఉంటానని తెలిపారు. అదేవిధంగా దాడి జరిగిన కార్యాలయం, ఇంటిని, ధ్వంసమైన కారును కూడా పరిశీలించారు. అయితే.. మధ్యాహ్నం 11-12 మధ్య అంబటి కుటుంబాన్ని పరామర్శించాల్సి ఉన్నప్పటికీ.. భారీ ర్యాలీగా ఆయన ఇంటికి చేరుకునే సరికే సాయంత్రం 4 గంటలు అయింది. రోడ్డు పొడవునా జగన్తనదైన శైలిలో అభివాదాలు చేసుకుంటూ ముందుకు సాగారు.
