వైసీపీ టాక్: 'రచ్చబండ'లకు రెడీనా.. !
ముఖ్యంగా నగరాలు, పట్టణాలలో పాదయాత్ర ఎలానూ ఉన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో రచ్చ బండ చేపడితే.. పార్టీకి మళ్లీ పునర్వైభవం వస్తుందన్న సూచనలు ఎక్కువగానే ఉన్నాయి.
By: Garuda Media | 14 Aug 2026 7:00 AM ISTక్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకునేందుకు గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన `రచ్చబండ` కార్యక్రమం గుర్తుండే ఉంటుంది. 2009 సెప్టెంబరులో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలు దేరిన ఆయన హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత.. ఈ కార్యక్రమానికి అందరూ దూరంగా ఉన్నారు. వైసీ పీ హయాంలో జగన్.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావించినా.. నాటి సెంటిమెంటుతో ఆయన వెనుకంజ వేశారు. కానీ, ఇప్పుడు మరోసారి.. రచ్చబండ కార్యక్రమానికి సంబంధించి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
వైసీపీ నాయకుల సమాచారం మేరకు.. త్వరలోనే రచ్చ బండ కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టనున్నట్టు తెలు స్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. ఆయన ప్రజలను కలుసుకునేందుకు రచ్చబండ అయితేనే బాగుంటుందన్న సూచనలు అందాయి. మొదట్లో దీనిపై పెద్దగా ఆసక్తి చూపకపోయినా.. తర్వాత కాలంలో నాయకుల నుంచి పదే పదే ఈ సూచనలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు రచ్చ బండకు జగన్ రెడీ అవుతున్నట్టు చెబుతున్నారు. తద్వారా పార్టీకి ఊపు వస్తుందన్న అంచనా వేసుకుంటున్నారు.
ముఖ్యంగా నగరాలు, పట్టణాలలో పాదయాత్ర ఎలానూ ఉన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో రచ్చ బండ చేపడితే.. పార్టీకి మళ్లీ పునర్వైభవం వస్తుందన్న సూచనలు ఎక్కువగానే ఉన్నాయి. గ్రామీణుల సమస్యలను తెలుసుకునేం దుకు.. వారిలో మరోసారి సెంటిమెంటును రగిలించేందుకు కూడా.. ఈ కార్యక్రమం దోహద పడుతుందన్న లెక్కలు వేసుకుంటున్నారు. వాస్తవానికి వైసీపీ గ్రామీణ ఓటు బ్యాంకుపై భారీగానే ఆశలు పెట్టుకుంది. కానీ, గత ఎన్నికల్లో ఇది బెడిసి కొట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి గ్రామీణులకు చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏం చేస్తారు..?
ఒకవేళ రచ్చబండ కార్యక్రమానికి జగన్ సిద్ధమైతే.. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ము ఖ్యంగా వైసీపీకి అండగా ఉన్న ప్రాంతాలను గుర్తించి.. అక్కడ పర్యటించనున్నారు. గ్రామీణులను తనవైపు తిప్పుకో వడంతోపాటు.. గత, ప్రస్తుత సంక్షేమ పథకాలను వివరించే ప్రయత్నం చేస్తారు. అదేసమయంలో కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్న రైతులను కూడా కలుసుకోనున్నారు. తద్వారా వారి సమస్యలు తెలుసుకుని.. తమవైపు తిప్పుకోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అయితే.. ప్రస్తుతానికి ఈ కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. త్వరలోనే స్థానిక ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో ముందుకు సాగుతుందా? లేదా? అనేది చూడాలి.
