వైసీపీ స్ట్రాటజీ: పాదయాత్ర టైం కోసమే.. !
వచ్చే ఏడాది వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. అయితే.. ఏ కార్యక్రమానికైనా.. పునాది అంటూ ఉండాలి.
By: Garuda Media | 30 Jun 2026 1:00 AM ISTవచ్చే ఏడాది వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. అయితే.. ఏ కార్యక్రమానికైనా.. పునాది అంటూ ఉండాలి. దానిపైనే నాయకులు చేసే రాజకీయాలు నిలబడడమా.. కూలడమా? అనేది తేలుతుంది. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ భవిష్యత్తులో చేయాలని నిర్ణయించుకున్న పాదయాత్రకు సంబంధించిన మసాలాను ఇప్పటి నుంచే రెడీ చేస్తున్నట్టు ప్రస్తుత రాజకీయాలను చూస్తే అర్ధం అవుతుంది.
పాదయాత్ర వంటి కార్యక్రమాలు హిట్ కొట్టాలంటే.. తమకు అనుకూలంగా వాతావరణం మలుచుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసే సమయానికి వైసీపీ ప్రభుత్వంపై యువతకు పెద్ద ఎత్తున ఆగ్రహం ఉంది. ఒక్కటంటే ఒక్క డీఎస్సీ కూడా వేయకపోవడం, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టకపోవడం వంటివి యువతలో ఆగ్రహాన్ని పెంచాయి.
ఇదే సమయంలో నిత్యావసర వస్తువుల ధరలతోపాటు ఇతర పన్నుల బాదుడు కూడా ప్రజలను ఇరకాటం లో పడేసింది. ఇక, దేశంలోనే తొలిసారిగా చెత్తపై పన్ను విధించిన వైసీపీపై ప్రజలు కన్నెర్ర చేశారు. ఇదే సరైన సమయం అనుకున్న లోకేష్.. తన పాదయాత్రను ప్రారంభించారు. అది ఆయనకు అన్ని రూపాల్లో నూ కలిసి వచ్చింది. అయితే.. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ చేయాలని తలపోస్తున్న పాదయాత్రకు భూమిక అంటూ కనిపించడం లేదు.
వైసీపీ నాయకులు పైకి చెబుతున్నట్టుగా కూటమి సర్కారుపై ప్రజల్లో భారీ ఎత్తున వ్యతిరేకత కూడా ఏమీ లేదు. సాధారణంగా ఉండే 10-15 శాతం వ్యతిరేకత మాత్రమే ఉంది. దీంతో పాదయాత్ర చేపట్టినా.. సక్సెస్ కావడం కష్టమనే భావన వైసీపీ నాయకుల్లో కనిపిస్తోంది. అందుకే.. ఉద్యమాలు, మద్దతు అంటూ.. కొత్త రాగాలు తీస్తున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది. అంటే.. కల్పిత వ్యతిరేకతను అడ్డు పెట్టుకుని పాదయాత్రకు పునాదులు వేసుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
