ఘర్ వాపసీ : వైసీపీ ఆశలు గల్లంతే.. !
"మన పార్టీ నుంచివెళ్లిపోయినోళ్లు కూడా మంచోళ్లే. వారి అవకాశం.. వారు చూసుకున్నారు. తప్పేముంది. వారిని ఏమీ అనొద్దు!."
By: Garuda Media | 30 March 2026 8:00 PM IST``మన పార్టీ నుంచివెళ్లిపోయినోళ్లు కూడా మంచోళ్లే. వారి అవకాశం.. వారు చూసుకున్నారు. తప్పేముంది. వారిని ఏమీ అనొద్దు!.`` అని కొన్నాళ్ల కిందట వైసీపీ అధినేత జగన్ పార్టీనాయకులకు , కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేశారు. అంతేకాదు.. ఆయన కూడా..ఎవరినీ ఇప్పటి వరకు పన్నెత్తు మాట అనలేదు. పైగా వారి అవసరాలు వారివి.. అంటూ జగన్ సరిపెట్టుకున్నారు. దీనిపై అప్పట్లో చాలా మంది నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదేంటని నొసటలు చిట్లించారు.
తర్వాత కాలంలో పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారిని తిరిగి చేర్చుకునే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నట్టు జగన్ తెలిపారు. ``ఎవరూ విభించడానికి వీల్లేదు. వెళ్లిపోయిన వాళ్లు తమ తప్పులు తెలుసుకుని.. మళ్లీ వస్తామంటే ఆహ్వానించండి. కండువాలు కప్పండి. పార్టీ అందరిదీ`` అని ముక్తాయిం చారు. ఇది జరిగి కూడా ఆరేడు మాసాలు అయింది. కానీ, ఒక్కరు కూడా వెళ్లిన వారు ఎవరూ తిరిగి వైసీపీ గూటికి చేరలేదు. పైగా.. కొన్ని కొన్ని జిల్లాల్ల వెళ్లిపోతున్నవారే ఎక్కువగా ఉన్నారు.
గతంలో బాలినేనిశ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ వంటివారు వెళ్లిపోయారు. 2024 ఎన్ని కలకు ముందు వెళ్లిపోయిన వారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే.. వారిలో కొందరు విజయం దక్కించుకున్నారు. ఇక, వారు ఎలానూ తిరిగి రారు. దీంతో వైసీపీ నుంచి బయటకు వచ్చాక కూడా టికెట్లు రానివారు.. ప్రాధాన్యం దక్కని వారిని సెంట్రిక్గా చేసుకుని వైసీపీ అధినేత వ్యాఖ్యానించారు. వారికి గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని కూడా చెప్పారు.
అయితే.. ఇది నిన్నటి మాట. కానీ.. ఇప్పుడు పరిస్థితులు.. పరిణామాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో 88 సీట్లు పెరుగుతున్న క్రమంలో అందరికీ `సంతృప్త` స్థాయిలో సీట్లు దక్కనున్నాయి. ఒకరిద్దరి గ్రాఫ్ ఎలా ఉన్నా.. జంపింగులకు ఈ దఫా న్యాయం జరగొచ్చు. అంటే.. వారు నమ్ముకున్న పార్టీలు వారికి టికెట్లు ఇచ్చేందుకు వెనుకాడే పరిస్థితి ఉండకపోవచ్చు. దీంతో తిరిగి వైసీపీలోకి వెళ్లాలన్న ఆలోచన కానీ.. చర్యలు కానీ.. వారికి ఇక ఉండవు. ఉన్నచోటే సీట్లు దక్కితే.. వైసీపీతో పనేంటి? అనే మాటే వినిపిస్తుంది. సో .. ఈ పరిణామం వైసీపీకి శరాఘాతం కానుంది.
